దంచి కొట్టిన వాన..
- ఈదురు గాలులతో పలుచోట్ల లేచిపోయిన ఇంటి పైకప్పులు
- ఆదుకోవాలంటున్న బాధితులు
కుమ్రం భీం ఆసిఫాబాద్ .జూన్4(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కురిసిన వర్షం ప్రజలకు ఎండల నుంచి ఉపశమనం కలిగించింది. గత కొన్ని రోజులుగా మండుతున్న ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు వర్షంతో ఊరట పొందారు. వర్షం కురవడంతో ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడింది. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులపై వర్షపు నీరు ప్రవహించగా, కొన్ని ప్రాంతాల్లో నీరు నిలిచింది.
ఆసిఫాబాద్ మండలంలోని కోసారా గ్రామంలో ఈదురు గాలుల బీభత్సానికి చౌహన్ దేవిదాస్ ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. ఇంట్లో సామగ్రి తడిసి నష్టపోయిందని బాధిత కుటుంబం తెలిపింది. ప్రభుత్వం, అధికారులు స్పందించి తక్షణ సహాయం అందించాలని వారు కోరుతున్నారు. కొన్ని గ్రామాల్లో కూడా బలమైన గాలులతో చెట్ల కొమ్మలు విరిగిపడినట్లు స్థానికులు తెలిపారు. భారీ వర్షంతో విద్యుత్ సరఫరాకు కూడా కొంత అంతరాయం ఏర్పడింది.ఎండల తీవ్రత తగ్గడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. దూకి దున్నిన చేను లకు వర్షాలు ఉపయోగపడతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.






