calender_icon.png 20 June, 2025 | 11:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యేలకు అగ్ని పరీక్షే!

20-06-2025 12:53:46 AM

  1. స్థానిక సంస్థల ఎన్నికలే పనితీరుకు ప్రామాణికం
  2. సీఎం, టీపీసీసీ ఆదేశాలతో నియోజకవర్గాల్లో సమీక్షలు
  3. అత్యధిక స్థానాలు సాధించడమే లక్ష్యంగా ప్రణాళిక
  4. పట్టు సాధించేందుకు బీఆర్‌ఎస్, బీజేపీ వ్యూహం
  5. గ్రామాల్లో మొదలైన ఎన్నికల సందడి

సంగారెడి, జూన్ 19(విజయక్రాంతి): ఏం రామన్న.. వెంకన్న.. గోపాల్.. చారిగారు.. రెడ్డిగారు.. ఏంటి పరిస్థితి మన పాలన వచ్చి ఏడాదిన్నర దాటింది..గ్రామాల్లో ఏమనుకుంటున్నారు ? సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎవరు పోటీకి సిద్దంగా ఉన్నారు. ఎవరెవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయి. బీఆర్‌ఎస్ పార్టీ బలం ఎలా ఉంది.. ఆ పార్టీలోని బలమైన నాయకులు మనవైపు వచ్చేలా ఉన్నారా..? మీరేం చేస్తారో తెలియదు..

కానీ రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో నియోజకవర్గంలోని అత్యధిక స్థానాలు మనం గెలవాలి...గెలిచి సీఎం, పార్టీ పెద్దల ముందు నిలబడాలి. అలా అయితేనే మనకు కావాల్సిన నిధులు వస్తాయి. మన నియోజకవర్గ నాయకులకు మంచి పదవులు వస్తాయి... అని ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఓ నియోజకవర్గ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులతో సంభాషించిన తీరు.

స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు సవాల్ గా మారనున్నాయి. కాగా అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈమేరకు ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పార్టీ బలం, స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ బలం ఏంటో నిరూపించేందుకు సిద్దమవుతున్నారు. 

క్షేత్రస్థాయిలో సమీక్షలు..

ఏ నిమిషంలోనైనా గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నగారా మోగే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు క్షేత్రస్థాయిలో పార్టీ బలం ఎలా ఉందనే విషయం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నిఘా వర్గాలు ఇచ్చిన నివేదికలతో పాటు మండల, గ్రామస్థాయి కార్యకర్తలతో సమీక్షలు నిర్వహించడం, పార్టీ మండల బాధ్యులు, ఇతర ముఖ్య కార్యకర్తలను గ్రామాలకు పంపించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఐక్యంగా పనిచేయాలని చెబుతూ సమాయత్తం చేస్తున్నారు.

అదేవిధంగా కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజలు అసంతృప్తి గా ఉండడం, ఇసుక, భూ దందాల్లో అధికార పార్టీ నాయకులు ప్రమేయం ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఈ అంశాలన్ని స్థానిక ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు ప్రచారం.

ఇలాంటి దందాలపై కొందరు కార్యకర్తలు సదరు నాయకులకు బహిరంగంగానే చెప్పిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే వీటన్నింటిని సరిదిద్దడం, గ్రామాల్లో ఉన్న వర్గాలను ఏకం చేయడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామని అసమ్మతి వాదులను బుజ్జగించే పనిలో నాయకులు ఉన్నారు. 

పట్టు సాధించేందుకు బీఆర్‌ఎస్ వ్యూహం..

సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు గాను ఏడింట బీఆర్‌ఎస్ విజయం సాధించింది. కేవలం మూడు స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ గెలుపొందినా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ నాయకులు స్థానిక ఎన్నికల్లో పట్టు సాధించి సత్తా చాటేందుకు సన్నద్ధమవుతున్నారు.

దీనిలో భాగంగానే మాజీ మంత్రి హరీష్రావు ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాలకు ఎన్నికల ఇంచార్జిలను నియమించే పనిలో ఉన్నట్లు ప్రచారం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సైతం అధికారం మనదే కాబట్టి స్థానిక సంస్థల్లో సైతం సత్తా చాటాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇలావుండగా కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాల అమలులో లోపాలను ఎత్తి చూపడం.

గత పాలనకు, ప్రస్తుత పాలనకు పోలుస్తూ ప్రజలను చైతన్యం చేయాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. అయితే మాజీ మంత్రి హరీష్రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ సీఎం కేసీఆర్ అవినీతి ఆరోపణలపై విచారణలు ఎదుర్కొంటుండగా, మరో వైపు కేసీఆర్ కూతురు కవిత పార్టీ నాయకులపై విమర్శలు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ నాయకులను, కార్యకర్తలను ఏకతాటిపైకి తెచ్చి స్థానిక సంస్థల్లో పట్టు ఎలా సాధిస్తారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

బీజేపీ పాగా వేస్తుందా ?

ప్రధాని మోడీ చరిష్మా, ఎంపీ, అసెంబ్లీ స్థానాలతో పాటు ఇటీవల నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం బీజేపీ విజయం సాధించింది. ఇదే ఊపును కొనసాగిస్తూ ఉమ్మడి మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల్లో పట్టు సాధించేందుకు కమలం నేతలు, కార్యకర్తలు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఎంపీ రఘునందన్రావు మెదక్ లోక్సభ స్థానంలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎలాగైనా స్థానిక సంస్థలను గెలుపొంది గ్రామీణ స్థాయిలో సైతం బీజేపీని మరింత బలోపేతం చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. మొత్తానికి రాబోయే స్థానిక ఎన్నికల్లో పల్లెల్లో సైతం ట్రయాంగిల్ పోటీ నెలకొనే పరిస్థితి నెలకొన్నది మాత్రం వాస్తవం.