calender_icon.png 20 June, 2025 | 5:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్య .. వ్యా పారమా..?

20-06-2025 12:40:28 AM

-ప్రైవేట్ విద్యాసంస్థల ఇష్టారాజ్యం

-అడ్డగోలుగా ఫీజుల వసూలు

-పాఠశాలలోనే యూనిఫామ్‌లు పుస్తకాల విక్రయం

-ఉదాసీన వైఖరిలో విద్యాశాఖాధికారులు

ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు లేవని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తే వారు ఫీజుల రూపంలో వేలాది రూపాయలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. కేవలం ఫీజులే కాకుండా పుస్తకాలు కూడా తమవద్దే కొనాలని చెబుతూ అధిక ధరలకు అమ్ముతున్నారు. కనీసం విద్యాహక్కు చట్టం ఎక్కడా అమలు కావడం లేదు. దీనిపై అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

నల్లగొండ టౌన్, జూన్ 19: నల్లగొండ జిల్లాలో పైవ్రేట్ విద్యా సంస్థల దోపిడీకి అడ్డూ అదుపులేకుండా పోతోంది. యాజమాన్యాలు వ్యాపార ధోరణితో వ్యవహరిస్తుండడంతో సామాన్యుడికి ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారుతుంది. కష్టపడి సంపాదించినదంతా పిల్లల చదువుకే ఖర్చవుతుండడంతో పేద, మధ్య తరగతి వారు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యను వ్యాపారంగా మార్చిన పైవ్రేట్ విద్యా సంస్థలు ఇష్టానుసారంగా ఫీజులను వసూలు చేస్తున్నాయి. ఫీజులకు తోడు యూనిఫాంలు, పుస్తకాలు, నోట్బుక్లు, బస్సు ఫీజులంటూ భారీగా వసూలు చేస్తున్నారు. దీంతో చాలామంది వడ్డీలకు డబ్బులు తీసుకువచ్చి పిల్లలను చదివిస్తూ అప్పుల పాలవుతున్నారు.

వసతుల పేరిట..

జిల్లాలో పుట్టగొడుగుల్లా కొత్తగా పాఠశాలలు పుట్టుకు వచ్చాయి. కొందరు అర్హతలేకున్నా విద్యా సంస్థలను నడుపుతూ.. నయా దోపిడీకి శ్రీకారం చుడుతున్నారు. తమ వద్ద కొన్ని ప్రత్యేకమైన వసతులు, తరగతులు ఉంటాయని చెబుతూ తల్లిదండ్రుల నుంచి యథేచ్ఛగా ఫీజులు వసూలు చేస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు తప్పని పరిస్థితిలో ఫీజులను చెల్లిస్తున్నారు. హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లి తమ పిల్లలను చదివించలేని పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలు ఇక్కడే స్థానికంగా ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న పాఠశాలలు ఫీజులను పెంచేసి దోపిడీకి పాల్పడుతున్నాయి. జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ తరగతుల ఫీజులే రూ. 50వేల పైనే ఉన్నాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు నోట్ పుస్తకాలు, డ్రెస్సులు, బస్సు ఫీజులతో తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారు.

పాఠశాలల్లోనే పుస్తకాల విక్రయాలు...

ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాలు, నోట్ పుస్తకాలు అమ్మవద్దని స్పష్టమైన నిబంధనలు ఉన్నా పట్టించుకునేవారే కరువ య్యారు. అడ్మిషన్ తీసుకోగానే తమ పాఠశాలలోనే పుస్తకాలు, డ్రెస్లను విక్రయి స్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. హోల్సేల్ రేట్లకు (ఎమ్మార్పీపై 30శాతం తగ్గింపుతో) టెకస్ట్ పుస్తకాలు, నోట్ పుస్తకాలను కొనుగోలు చేస్తున్న పాఠశాలలు వాటిని ఎమ్మార్పీకి విక్రయిస్తున్నారు.

గత విద్యాసంవత్సరం ఒక్కో తరగతికి రూ. 3వేల నుంచి రూ.4 వేలు ఉన్న పుస్తకాల ధరలు ఈ విద్యాసంవత్సరం రూ. 6వేల నుంచి రూ.7 వేల వరకు పెరిగాయి. ఫీజుల నియంత్రణ కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఎక్కడా ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. నోటీసు బోర్డులపై పాఠశాల ఫీజుతో పాటు పరీక్ష ఫీజును ప్రదర్శించాల్సి ఉన్నా అది అమలు కావడంలేదు. ఇప్పటికైనా ప్రభుత్వ ఉత్తర్వులు, ఆదేశాలను విద్యాహక్కు చట్టాన్ని ప్రైవేట్ పాఠశాలలు అమలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నా

ప్రభుత్వ పాఠశాలల్లోనే  నాణ్యమైన విద్య..

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధన అందుబాటులో ఉంది. ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఫీజుల గురించి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తే వెంటనే ఫిర్యాదు చేయండి. ప్రైవేట్ స్కూల్స్ తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందే.

 బొల్లారం బిక్షపతి,  జిల్లా విద్యాధికారి