ఆప్ తుది జాబితా విడుదల
38 మందితో నాలుగో జాబితా
న్యూఢిల్లీ నుంచి కేజ్రీవాల్..
కాల్కాజీ నుంచి సీఎం అతిశీ
న్యూఢిల్లీ, డిసెంబర్ 15: త్వరలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరపున 38 మంది అభ్యర్థులతో కూడిన చివరిదైన నాలుగో జాబితాను ఆదివారం ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విడుదల చేశారు. ఇదివరకే మూడు జాబితాల్లో తన అభ్యర్థులను ఆప్ ప్రకటించింది. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలున్నాయి. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్, కల్కాజీ నుంచి ముఖ్యమంతి అతిశీ పోటీ చేయనున్నారు.
గ్రేటర్కైలాష్ నుంచి సౌరభ్ భరద్వాజ్ బరిలో ఉన్నారు. కస్తూర్భా నగర్ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే మదన్లాల్ స్థానంలో రమేశ్ పెహ్లాన్ను అభ్యర్థిగా ప్రకటించారు. ఆదివారమే రమేశ్, అతని భార్య, కౌన్సిలర్ కుసుమ్ లత బీజేపీని వీడి ఆప్లో చేరడం గమనార్హం. బాబార్పూర్నుంచి గోపాలరాయ్, ఓఖ్లా నుంచి అమానతుల్లా ఖాన్, షకుర్బస్తీ నుంచి సత్యేంద్ర కుమార్ జైన్ పోటీ చేయనున్నారు. కాగా కేజ్రీవాల్పై షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనేది హాట్ టాపిక్గా మారింది.
20 మంది సిట్టింగ్లకు టికెట్ నిరాకరణ
మొత్తం 20 మంది సిట్టింగ్ ఎ మ్మెల్యేలకు ఆప్ టికెట్లు నిరాకరించింది. అయితే వీరిలో ముగ్గు రు ఎమ్మెల్యేలకు బదులుగా వారి కుటుంబసభ్యులకు టికెట్లు కేటాయించింది. కృష్ణా నగర్ నుంచి ఎస్కే బగ్గా కుమారుడు వికాస్ బగ్గా, చాందినీ చౌక్ నుంచి ప్రహ్లాద్ సాహ్ని కుమారడు పురన్దీప్ సాహ్ని, ఉత్తమ్ నగర్ నుంచి పూజా బల్యాన్ పోటీ చేయనున్నారు.
పూర్తి విశ్వాసంతో..
ఆప్ పూర్తి విశ్వాసంతో 70 స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టినట్లు ఎక్స్ వేదికగా కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలో బీజేపీ అదృశ్యమైం దని, ఆ పార్టీకి సీఎం అభ్యర్థే లేరని ఎద్దేవా చేశారు. వారికి ఒక టీమ్, ప్రణాళిక లేదని, ఢిల్లీపై ఒక విజన్ లేదన్నారు. కేజ్రీవాల్ను తొలగించాలన్నదే వాళ్లకు ఉన్న ఏకైక ప్రణాళిక అని విమర్శించారు. ఢిల్లీ అభివృద్ధిపై ఆప్నకు ఓ విజన్ ఉందని, దీన్ని అమలు చేయడానికి తమకో టీమ్ కూడా ఉందన్నారు. ఎవరు పనిచేశారో వాళ్లకే ప్రజలు ఓటేస్తారని ఆయన పేర్కొన్నారు.






