calender_icon.png 2 June, 2025 | 8:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు

27-05-2025 01:06:20 AM

- ఫార్ములాెేఈ కేసులో ఈనెల 28న విచారణకు రావాలని ఆదేశం

- విదేశాల్లో కార్యక్రమాలున్నందన రాలేనన్న కేటీఆర్

- చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా విచారణకు సహకరిస్తానని వెల్లడి 

హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి): ఫార్ములా కేసులో బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సోమవారం ఏసీబీ నోటీసులు అం దించింది. ఈనెల 28న విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొంది.

ముందే నిర్ణయించిన కార్యక్రమాలకు హాజరయ్యేందుకు యూకే, యూఎస్‌ఏలకు వెళ్తున్నందున తిరిగొచ్చిన వెంటనే హాజరవుతానని ఏసీబీ అధికారులకు కేటీఆర్ రాతపూర్వకంగా తెలియజేశారు. రాజకీయంగా వేధించే ఉద్దేశంతోనే తనపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసు పెట్టిందని ఆరోపించారు.

అయినా చట్టాన్ని గౌరవించే పౌరుడిగా ఖచ్చితంగా విచారణ సంస్థలకు పూర్తిగా సహకరిస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, బీఆర్‌ఎస్ రజతోత్సవ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు లండన్, అమెరికా పర్యటనలు ముందే ఖరారు అయినందున మే 28న విచారణకు హాజరు కాలేనన్నారు.

అయితే విదేశాల నుంచి తిరిగొచ్చిన తర్వాత ఖచ్చితంగా విచారణకు వస్తానని ఏసీబీ అధికారులకు లిఖిత పూర్వకంగా తెలిపారు. 48 గంటల క్రితం నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ ద్వారా డబ్బులు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి పేరును ఈడీ చార్జ్‌షీట్‌లో నమోదు చేసిందని కేటీఆర్ గుర్తుచేశారు.

సరిగ్గా 24 గంటల తర్వాత ప్రధాని మోదీతో సహా బీజేపీ అగ్రనాయకులతో రేవంత్‌రెడ్డి సన్నిహితంగా కనిపించారని చెప్పారు. మనీ లాండరింగ్ కేసులో రేవంత్‌రెడ్డి పేరును ఈడీ పేర్కొన్నప్పటికీ ఒక్క తెలంగాణ బీజేపీ నేత కూడా అతన్ని ఏమనలేదని, ఇది ఆ రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహనకు, అనైతిక సంబంధానికి నిదర్శనమని కేటీఆర్ ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలు, అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకు రగిలిపోతున్న రేవంత్‌రెడ్డి, తనపై ప్రతీకారంతో ఎంతకైనా దిగజారుతారన్న సంగతి ఈ ఏసీబీ నోటీసులతో అర్థమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ను చూస్తే రేవంత్‌లో రోజురోజుకూ భయం పెరిగిపోతోందని పేర్కొన్నారు.

వైఫ్యల్యాలను కప్పిపుచ్చుకునేందుకే: ఎమ్మెల్సీ కవిత

తన వైఫల్యాలను కప్పిపుచ్చడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కేటీఆర్‌కి నోటీసుల జారీ చేసిందని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు బీఎర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

రేవంత్‌రెడ్డి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఏపీబీ నోటీసులు జారీ చేసినట్టు స్పష్టమవుతోందన్నారు. తమ పార్టీ నాయకులకు వరుస నోటీసులు జారీ చేయడం వెనక రాజకీయ దురుద్దేశమున్నట్టు తేటతెల్లమైందన్నారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ సైనికులదని కవిత అన్నారు. 

కేటీఆర్‌కు అండగా నిలుస్తాం: హరీశ్‌రావు

రేవంత్‌రెడ్డి అభద్రతకు స్పష్టమైన సంకేతమే కేటీఆర్‌కు నోటీసులు అని ఎక్స్ వేదికగా హరీశ్‌రావు విమర్శించారు. కల్పిత కేసులు కోర్టులో నిలబడవని, ప్రజల విశ్వాసాన్ని గెల్చుకోవన్నారు. కేటీఆర్‌కు అండగా నిలుస్తామని, సత్యం గెలుస్తోందన్న విశ్వాసం ఉందన్నారు.