27-05-2025 01:10:05 AM
- అంగీకరించిన టీజీఎంఎస్ఐడీసీ
- కాంట్రాక్టర్ బ్లాక్ లిస్ట్ ఫలితమే
- విజయక్రాంతి కథనానికి స్పందన
హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్సులిన్ సప్లయ్ లేక రోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటూ విజయక్రాంతి దినపత్రికలో ఇన్సులిన్ నో స్టాక్ పేరిట సోమవారం కథనం ప్రచురితమైంది.
రాష్ట్రంలో ఇన్సులిన్ సప్లయ్ ఆగిపోవడం వల్ల పేదరోగుల పరిస్థితిని ఈ కథనంలో వివరించగా.. దీనిపై తెలంగాణ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఎంఎస్ఐడీసీ) స్పందించింది. ఇన్సులిన్ సప్లయ్ ఆగిపోయిన మాట వాస్తవేనని అంగీకరించింది.
పీహెచ్సీ స్థాయిలో ఇన్సులిన్ (30:70 ప్రీమిక్స్డ్ హ్యూమన్ ఇన్సులిన్) సరఫరా చేసే కాంట్రాక్టర్ను మరో రాష్ట్రంలో బ్లాక్లిస్ట్లో పెట్టినందున సదరు సప్లయర్ అనర్హతకు గురయ్యారని టీజీఎంస్ఐడీసీ స్పష్టం చేసింది. దీంతో తాజాగా టెండర్లను ఆహ్వానించించామని, అది సాంకేతిక అంశాల అంచనా వేసే దశలో ఉన్నట్టుగా కార్పొరేషన్ తెలిపింది.
మరో 15 రోజుల్లో ఈ సాంకేతిక అంశాలన్నీ ముగిసి టెండర్లు పిలిచిన తర్వాత రెగ్యులర్గా ఇన్సులిన్ సరఫరా చేస్తామని వెల్లడించింది. ర్యాపిడ్ యాక్టింగ్, లాంగ్ యాక్టింగ్ సహా ఇతర ఇన్సులిన్ అందుబాటులో ఉన్నట్టు కార్పోరేషన్ వెల్లడిస్తూ వివరణ ఇచ్చింది. ఎలాంటి ఆటంకాలు లేకుండా మందుల సరఫరా చేసేందుకు టీజీఎంఎస్ఐడీసీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలియచేసింది.
బ్లాక్లిస్టులో పెడితే ప్రత్యమ్నాయమేది?
రాష్ట్రంలోని మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో టైప్ రకం వారే అధికం. అయితే ఆ రకం ఇన్సులిన్ను సప్లయ్ చేసే కాంట్రాక్టర్ను వేరే రాష్ట్రంలో బ్లాక్ లిస్ట్లో పెట్టారని తెలంగాణలో సప్లయ్ ఆపేసినట్టుగా టీజీఎంఎస్ఐడీసీ వివరణ ఇచ్చినా.. ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం ఆశ్చర్యపరుస్తోందని పలువురు వైద్యులు పేర్కొంటున్నారు.
మరో రాష్ట్రంలో బ్లాక్ లిస్టులో పెట్టారంటేనే సదరు సప్లయర్ నాసిరకం ఇన్సులిన్ను పంపిణీ చేస్తున్నట్టు అర్థమవుతోందని ఫార్మా రంగానికి చెందిన నిపుణులు అంటున్నారు. అంటే మరో రాష్ట్రంలో బ్లాక్ లిస్టులో పెట్టే వరకు మన అధికారులు ఏం చేశారనేది ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. నిజంగా సదరు సప్లయర్ను ఆపేయాల్సి ఉంటే పక్క రాష్ట్రం బ్లాక్ లిస్టులో పెట్టకముందే మన అధికారులు అలర్ట్ కావాల్సి ఉండేదని వైద్య నిపుణులు అంటున్నారు.
టీజీఎంఎస్ఐడీసీలో గందరగోళ వ్యవస్థ వల్లే ఇలాంటి పరిస్థితి దాపురించినట్టుగా భావిస్తున్నారు. ఈ అంశంతో రాష్ట్రంలో సరఫరా అయ్యే మందుల్లో నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో భారీగా షుగర్ వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్న తరుణంలో టీజీఎంఎస్ఐడీసీ అధికారులు ఇంకా బ్లాక్లిస్ట్ అంటూ ఆలస్యం చేస్తూ టెక్నికల్ అంశాలు పూర్తయిన తర్వాత సరఫరా పునరుద్ధరిస్తామని చెప్పడం చూస్తే అసలు ఎప్పుడు సరఫరా అవుతుందో అర్థం కావడం లేదని పలువురు వైద్యులు పేర్కొంటున్నారు.
సరఫరా చేయడం లేదెందుకు: మంత్రి రాజనర్సింహ
రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులకు ఇన్సులిన్ సరఫరా ఆగిన వ్యవహారంపై విజయక్రాంతి దినపత్రికలో ప్రచురితమైన ఇన్సులిన్ నో స్టాక్ కథనంపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆరా తీశారు.
వెంటనే దీనిపై వివరణ ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇందుకు కారణాలు ఏమటో తెలియజేయడంతోపాటు వెంటనే ఇన్సులిన్ సరఫరా చేసి రోగులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆయన పేర్కొన్నారు.