calender_icon.png 4 June, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో ఢిల్లీలో ఓబీసీ బహిరంగ సభ!

27-05-2025 01:04:13 AM

- రాహుల్‌గాంధీకి కృతజ్ఞతగా నిర్వహించాలని ఏఐసీసీ ఓబీసీ ప్రతినిధుల నిర్ణయం 

- రాహుల్‌గాంధీ ఒత్తిడివల్లే కులగణనకు కేంద్రం దిగొచ్చిందని వెల్లడి 

- బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు: పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్

- తెలంగాణ కులగణన దేశానికి రోల్‌మోడల్: మంత్రి పొన్నం

హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి): కాంగ్రెస్‌పార్టీ, రాహుల్‌గాంధీ ఒత్తిడి వల్లే కేంద్ర ప్రభుత్వం జనగణనలో కుల గణన చేయడానికి ముందుకొచ్చిందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.

రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర వల్లే కులగణనవాదం ప్రజల్లోకి బలంగా వెళ్లిందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు. బీసీలకు మేలు జరగాలన్నదే రాహుల్‌గాంధీ ఆలోచన అని, అందుకు కృతజ్ఞతగా ఢిల్లీలోనే ఒక భారీ సభను నిర్వహించాలని నిర్ణయించారు.

కులగణన నిర్ణయంతో రాహుల్‌గాంధీ చరిత్రలో నిలిచిపోతారని పార్టీ నేతలు అన్నారు. పార్టీ పదవుల్లోనూ సామాజిక అంశం పాటించాలనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. సోమవారం ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లో ఓబీసీ ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించింది.

ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి, నేత భూపేశ్‌భగేల్, తెలంగాణ, మధ్యప్రదేశ్  పీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్, జిత్ పట్వారి,  ఏఐసీసీ నాయకులు మాణిక్‌రావుఠాక్రే, మానిక్‌ఠాకూర్, పీసీసీ మాజీ అధ్యక్షులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీకి చెందిన బీసీ నేతలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణలో జరిగిన కులగణన దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణ నసర్వే దారిలోనే కేంద్రం కూడా దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించబోతోందని తెలిపారు.

కులగణనతోనే దేశంలో బలహీనవర్గాలకు న్యాయం దక్కుతుందని, జనాభా ప్రకారం వాటా దక్కాలనేది రాహుల్‌గాంధీ నినాదమన్నారు. కులగణన ఎవరికీ వ్యతిరేకం కాదని, కులగణన ద్వారా ఇప్పటివరకు అవకాశం దక్కని బీసీలంతా ప్రజాస్వామ్య వేదికలో భాగస్వామ్యం అవుతారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన విధి విధానాలపై ఒక పుస్తకాన్ని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తామన్నారు.

పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణలో విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుచేస్తామని తెలిపారు. రాహుల్‌గాంధీ ఆలోచన, ఆదేశం మేరకు కులగణన చేశామన్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు మాట్లాడుతూ.. బీసీ ప్రధానిగా చెప్పుకునే నరంద్రమోదీ బీసీలకు చేసిందేమీ లేదన్నారు. తమిళనాడు తరహాలో తెలంగాణలో రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలంటే 9వ షెడ్యూల్‌లో చేర్చాలన్నారు.

అందుకు రాష్ట్రపతి, ప్రధాని మోదీని కలిసి ఒత్తిడి తీసుకురావాలన్నారు. సోనియాగాంధీ నిర్ణయం మేర కే ఐఐటీ, ఐఐఎంలో రిజర్వేషన్లు అమలవుతున్నాయని, లక్షలాది మంది బీసీ బిడ్డలు ఉన్నత చదువులు చదువతున్నారని తెలిపారు. తెలంగాణ నుంచి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, పీసీసీ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్‌యాదవ్ వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు మెట్టు సాయికుమార్, ముత్తినేని వీరయ్య పాల్గొన్నారు.