26-06-2025 05:12:40 PM
92 వేల నగదు, ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ..
రవాణా శాఖ అధికారులపై కొనసాగుతున్న విచారణ..
తెల్లవారుజాము నుంచి ఆర్టీవో చెక్పోస్టులో కొనసాగుతున్న తనిఖీలు..
కామారెడ్డి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉన్న మద్నూర్ శివాల్లోని సలాబత్పూర్ ఆర్టీవో చెక్పోస్ట్(Salabatpur RTO Checkpost)పై ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. గురువారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సలాబత్పూర్ ఆర్టిఏ చెక్ పోస్ట్ వద్ద ప్రైవేట్ వ్యక్తులు లారీలను ఆపి వారి వద్ద నుంచి నగదును వసూలు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రవేట్ వ్యక్తులు మరికొంతమంది పరారయ్యారు. 92 వేల నగదు పట్టుబడినట్లు, ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు తమ అదుపులో తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ రాజశేఖర్ గౌడ్ తెలిపారు.
పూర్తి వివరాలు తనిఖీలు పూర్తయిన తర్వాత వెల్లడిస్తామన్నారు. ఇద్దరు విధుల్లో ఉన్న రవాణాశాఖ అధికారులపై విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. అంతర్ రాష్ట్ర రవాణా శాఖ కార్యాలయంలో భారీ ఎత్తున అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాట్లు ఏసీబీ అధికారులకు సమాచార మందడంతోనే ఆకస్మికంగా దాడులు నిర్వహించినట్లు ఏ సి బి, డి ఎస్ పి రాజశేఖర్ గౌడ్ తెలిపారు. గురువారం తెల్లవారుజామున పక్క సమాచారం మేరకు ఏసీబీ అధికారులు సలాబత్పూర్ రవాణా శాఖ కార్యాలయంపై మెరుపు దాడులు నిర్వహించారు.
గత పది సంవత్సరాల క్రితం ఈ చెక్ పోస్ట్ పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి అప్పట్లో నగదును స్వాధీనం చేసుకున్నారు. 10 సంవత్సరాల తర్వాత ఏసీబీ అధికారులు మరోసారి సలాబత్ పూర్ రవాణా శాఖ చెక్పోస్ట్ పై దాడులు నిర్వహించడం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ విషయంపై జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డిని వివరణ కోరగా ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న మాట వాస్తవమేనని అంగీకరించారు.