calender_icon.png 1 June, 2025 | 5:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోరిగాంలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై చర్యలు

30-05-2025 09:12:47 PM

నిర్మల్,(విజయక్రాంతి): ముధోల్ మండలం బోరెగాం గ్రామంలో ప్రభుత్వ భూముల ఆక్రమణపై జిల్లా యంత్రాంగం తక్షణ చర్య తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ముధోల్ మండలం బోరెగాం గ్రామంలోని సర్వే నంబరు 249లో ఇటీవల కొందరు వ్యక్తులు ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించేందుకు యత్నించిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సమాచారాన్ని అందుకున్న రెవెన్యూ శాఖ అధికారులు తక్షణమే స్పందించి, సంబంధిత భూమి హద్దులను గుర్తించారు. అనంతరం ఆ అక్రమ ఆక్రమణలను తొలగిస్తూ, అవసరమైన చర్యలు చేపట్టారు. ఈ ఘటన నేపథ్యంలో రెవెన్యూ, ల్యాండ్ సర్వే విభాగాలకు చెందిన అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని జిల్లా యంత్రాంగం నియమించింది.

ప్రస్తుతం ఆ కమిటీ విచారణ కొనసాగిస్తున్నది. భవిష్యత్తులో ఇటువంటి అక్రమాలు చోటుచేసుకోకుండా నివారించేలా జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపడుతోంది. అయితే ఈ వ్యవహారంలో కొంతమంది వ్యక్తులు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా అసత్య ప్రచారాలు, పుకార్లు వ్యాప్తి చేయడానికి యత్నిస్తున్నట్లు గుర్తించబడింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, "ప్రజలు ఎవరూ అసత్య ప్రచారాలు, పుకార్లను నమ్మవద్దు. బోరెగాం గ్రామ ప్రజలందరికీ జిల్లా యంత్రాంగం పూర్తి అండగా నిలుస్తోంది. ఎక్కడా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాము" అని స్పష్టం చేశారు.