calender_icon.png 1 June, 2025 | 6:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

30-05-2025 09:21:47 PM

ప్రభుత్వ కార్యాలయాలు, అభివృద్ధి పనుల తనిఖీ

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సుడిగాలి పర్యటన

బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): నిరుపేదలకు గూడు కల్పించాలనే ఉద్దేశ్యంలో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం మంచిరాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నెపల్లి మండలం టేకులపల్లిలో నిర్మిస్తున్న నమూనా ఇందిరమ్మ ఇంటి నిర్మాణంతో పాటు గొల్లగట్టు, కన్నెపల్లి గ్రామాలలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను తహశీల్దార్ శ్రావణ్ కుమార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శంకర్ లతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడారు. నిరుపేద ప్రజల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలనీ ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక జాబితాలో పారదర్శకంగా వ్యవహరించాలని, జాబితాలో అర్హత గల వారి వివరాలు మాత్రమే ఉండాలని తెలిపారు.

ఇదే క్రమంలో టేకులపల్లి గ్రామంలోని నర్సరీని సందర్శించి మొక్కల సంరక్షణపై తగు చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. సకాలంలో మొక్కలకు నీటిని అందించి జిల్లాలో నాటేందుకు నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు సిద్ధం చేయాలని తెలిపారు. గ్రామంలోని ప్రతి ఇంటికి నిరంతరాయంగా త్రాగునీటిని అందించాలని, మిషన్ భగీరథ పథకంలో నల్లా కనెక్షన్లు లేని ప్రాంతాలకు నీటి ట్యాంకులు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. కన్నెపల్లి మండల కేంద్రంలో చేపట్టిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. స్థానిక ప్రజలకు మరింత అందుబాటులో మెరుగైన, వేగవంతమైన వైద్య సేవలు అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత నిస్తూ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అనంతరం తహశిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు. వివిధ ధృవపత్రాల కొరకు అందిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిశీలించి నిబంధనలకు లోబడి ధృవపత్రాలు జారీ చేయాలని ఆదేశించారు. కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని, వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని హితవుపలికారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని సందర్శించి మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నూతన రేషన్ కార్డులు, చేర్పులు, మార్పుల కొరకు అందిన రేషన్కార్డుల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి అర్హుల వివరాలతో జాబితా తయారు చేయాలని తెలిపారు.కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు పాల్గొన్నారు.