15-06-2025 11:23:50 PM
పలువురికి గాయాలు..
కామారెడ్డి (విజయక్రాంతి): కామరెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చందర్ నాయక్(Additional Collector Chander Nayak) సీసీ కారు ఆదివారం సాయంత్రం కామారెడ్డి జిల్లా భిక్కనూరు సమీపంలో బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి. రాజశేఖర్ తన కుటుంబ సభ్యులతో కారులో నాచారం లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం వెళ్లారు. తిరిగి కారులో కుటుంబ సభ్యులతో కలిసి తిక్కనూరు మండలం బస్వాపూర్ సమీపంలో ఎదురుగా వెళ్తున్న కారు సడన్ బ్రేక్ వేయడం కారును తప్పించబోయి బోల్తా పడింది.
ఈ ఘటనలో సీసీ రాజశేఖర్ భార్య నిహారిక, కుమారులు అద్వైత్, అరుణ్, స్నేహితుడు మోహన్ అతని కుమారుడు అగస్త్యలకు తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వస్తున్న జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి గమనించి తన కారులో క్షతగాత్రులను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించగా భిక్కనూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సంఘటనను పరిశీలించారు.