ఈ నెల 22 నుంచి రైతు భరోసా పంపిణీ.. అసెంబ్లీ సాక్షిగా ఆది శ్రీనివాస్ ప్రకటన
- వరి వేస్తే ఉరే అన్నారు..
- రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
- బీఆర్ఎస్.. రైతుభరోసా ఇచ్చి ఇదే జిందా తిలిస్మాత్ అనుకోమన్నారు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. సభలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్(Adi Srinivas Speech) మాట్లాడుతూ... ఈ నెల 22 నుంచి రైతుభరోసా(Rythu Bharosa) నిధులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మందికిపైగా రైతు భరోసా నిధులు అందుతాయని అసెంబ్లీలో ప్రకటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు వరి వేస్తే ఉరి అన్నారు, సన్న బియ్యం పండించే రైతులకు రూ. 500 బోనస్ అందిస్తున్నామని తెలిపారు.
బీఆర్ఎస్.. రైతుభరోసా ఇచ్చి ఇదే జిందా తిలిస్మాత్(Zinda Tilismath) అనుకోమన్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు భరోసా, సన్న బియ్యానికి బోనస్, పనిముట్లు అందిస్తున్నామని ఆది శ్రీనివాస్ వెల్లడించారు. రైతులు, ప్రజల మద్దతుతో మున్సిపల్, ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయం దక్కిందని పేర్కొన్నారు. అబద్ధాలు ఆడి ప్రజలను తపుదోవ పట్టిస్తే మిమ్మల్ని ప్రజలు విశ్వసించరని ఆది శ్రీనివాస్ చురకలంటించారు. కాళేశ్వరం నుంచి చుక్క నీరు తీసుకోకపోయినా 71.86 టన్నుల ధాన్యం పండించామని వివరించారు. పండించిన ధాన్యంలో 39.08 లక్షల టన్నుల సన్న బియ్యం ఉందని ఆయన సూచించారు.




