09-06-2025 12:40:13 AM
అభినందించిన ఎమ్మెల్యే సంజయ్, పలువురు ప్రముఖులు
జగిత్యాల అర్బన్, జూన్ 08 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లాధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్’కు ఆదివారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో అమాత్య పదవి లభించడంతో జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వెల్లివిరిసాయి. తమ ప్రియతమ నాయకుడు అ డ్లూరి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ధర్మపురి నియోజకవర్గంతో పాటూ జగిత్యాల జిల్లాలోని కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందోత్సహాలు వెళ్లి విరిసాయి.
2008లో అప్పటి బుగ్గారం ని యోజకవర్గం నుండి గెలుపొందిన జువ్వాడి రత్నాకర్’రావు మొట్ట మొదటిసారిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో ధర్మపురి అసెంబ్లీగా మారిన ఈ నియోజకవర్గము నుండి 2014లో టిఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ విజయం సాధించి ప్రభుత్వ చీఫ్ విప్ గా కొనసాగి 2018లో కెసిఆర్ మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు మంత్రి పదవి వరించడంతో ధర్మపురి నియోజకవర్గంలో పాటు జగిత్యాల జిల్లా చరిత్రలో మరో రాజకీయ ఘట్టం నమోదయింది. మంత్రిగా ప్ర మాణ స్వీకారం చేసిన లక్ష్మణ్ కుమార్’ను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు. జిల్లాలోని పలువురు కాంగ్రెస్ నాయకులు అడ్లూరిని కలిసి శుభాకాంక్షలుతెలియజేశారు