ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏఐ శిక్షణ
కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట, జూన్ 10 (విజయక్రాంతి): కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులతో సమానంగా ప్రభుత్వ పాఠశాల పిల్లలకు కూడా అత్యాధునిక సాంకేతిక అవకాశాలు దక్కాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఏఐ శిక్షణ అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు.
టీ-ఫైబర్, సూపర్ టీచర్ ఎడ్యు రిఫారమ్స్ సంస్థల సహకారంతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న నెల రోజుల ఏఐ శిక్షణా కార్యక్రమం పోస్టర్ను బుధవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ శిక్షణా కార్యక్రమం 2026 జూన్ 15 నుండి జూలై 11 వరకు నెల రోజుల పాటు కొనసాగనుందన్నారు. మొదటి విడతగా జిల్లాలోని నాలుగు పాఠశాలల్లో దీనిని నిర్వహించనున్నామన్నారు. డిజిటల్ యుగంలో రాణించడానికి ఏఐ అక్షరాస్యత ఎంతో కీలకమన్నారు.
ఇది విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి భారతదేశ డిజిటల్ పరివర్తన ప్రయాణంలో వారిని భాగస్వాములను చేస్తుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, డిజిటల్ సాధనాలను బాధ్యతాయుతంగా ఎలా వాడుకోవాలో నేర్పడం ద్వారా వారి ఉపాధి అవకాశాలను మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. దీనిని పైలెట్ ప్రాజెక్టు గా సూర్యాపేట జిల్లాలో అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం అయితే, రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా ఇలాంటి శిక్షణా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి అశోక్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ గఫ్ఫార్, టీ-ఫైబర్, సూపర్ టీచర్ ఎడ్యు రిఫారమ్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.






