06-02-2026 02:15:48 AM
సిద్ధిఖీపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు
విద్యాసంస్థల గుర్తింపులో మోసగించారంటూ యూజీసీ అభియోగాలు
కోర్టులో హాజరుపరిచిన ఢిల్లీ పోలీసులు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: విద్యాసంస్థల గుర్తిం పు విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చి మోసం చేశారనే ఆరోపణలపై హరియాణాలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ చైర్మన్ జవాద్ జావెద్ అహ్మద్ సిద్ధిఖీని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ క్రైం బ్రాంచ్ అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంలో సిద్ధిఖీపై ఢిల్లీ పోలీసులు రెండు వేర్వేరు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అరెస్ట్ అనంతరం సిద్ధిఖీని ఢిల్లీ కోర్టులో హాజరుపరచగా కోర్టు నాలుగు రోజుల పోలీసు కస్టడీ మంజూరు చేసినట్లు తెలిపారు.
13న ఈడీ చార్జీషీట్పై విచారణ
జనవరి 16న అల్ ఫలాహ్ గ్రూప్ చైర్మన్ జవాద్ అహ్మద్ సిద్ధిఖీ, అల్ ఫలాహ్ చారిటబుల్ ట్రస్ట్పై మనీలాండరింగ్ కేసులో ఎన్ఫో ర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జ్షీట్ దాఖలు చేసింది. దీనిపై వాదనలు వినేందుకు ఢిల్లీ సాకేత్ కోర్టు విచారణను ఫిబ్రవరి 13కు వాయిదా వేసింది. చార్జీషీట్తో పాటు సమర్పించిన పత్రాలను పరిశీలించేందుకు సిద్ధికీ తరఫు న్యాయవాది సమయం కోరడంతో కోర్టు విచారణ వాయిదా వేసింది. యూనివర్సిటీ, అనుబంధ సంస్థలు గడువు ముగిసిన నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సి ల్ (నాక్) గుర్తింపును ఉన్నట్లుగా చూపించినట్లు ఈడీ తెలిపింది. తప్పుడు ప్రకటనల ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులను తప్పుదారి పట్టించి అడ్మిషన్లు పొందారని తెలిపింది. ఆ విధంగా వసూలు చేసిన ఫీజులు ’ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్’ కిందకు వస్తాయని పేర్కొంది.