కులగణనలో బీసీలందరూ విధిగా నమోదు చేసుకోవాలి
ఎంపీ రవిచంద్ర పిలుపు
మహబూబాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి): జనాభా లెక్కల సేకరణ సందర్భంగా జరిగే కులగణనలో మున్నురుకాపులతో పాటు బీసీలందరూ విధిగా పాల్గొని తమ కులాన్ని నమోదు చేసుకోవాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, మున్నూరుకాపు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వద్దిరాజు రవిచంద్ర కోరారు. దేశం బ్రిటీష్ వారి ఏలుబడిలో ఉన్నప్పుడు 1931లో జనాభా లెక్కల సేకరణ సందర్భంగా కులగణన జరిగిందని, తిరిగిప్పుడు సెన్సెస్ 2027లో చేపడుతున్నారన్నారు.
బీసీల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ పరిస్థితులను సమగ్రంగా తెలుసుకునేందుకు కులగణన అవసరమని ఎంపీ రవిచంద్ర చెప్పారు. ఇది సంక్షేమ, అభివృద్ధి పథకాలను మరింత సమర్థవంతంగా అమలు పర్చేందుకు, రిజర్వేషన్ల కల్పనకు దోహదపడుతుందన్నారు. ఎటువంటి సంకోచం లేకుండా ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ విధిగా పాల్గొని తమ కులాన్ని నమోదు చేసుకోవాల్సిందిగా మున్నూరుకాపులతో పాటు బీసీలందరికి ఎంపీ వద్దిరాజు పిలుపునిచ్చారు.






