10-06-2025 03:14:42 PM
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ టౌన్, (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పౌష్టికాహార పంపిణీ, పాఠశాల పూర్వ విద్య కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందేందుకు 5 సంవత్సరాలలోపు పిల్లలందరినీ దగ్గర్లోని అంగన్వాడి కేంద్రాలలో నమోదు చేయించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు.రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 10 నుండి 17 వరకు నిర్వహిస్తున్న “అమ్మ మాట అంగన్వాడి బాట”(Amma Mata-Anganwadi Bata) కార్యక్రమంలో భాగంగా మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని గొల్లగూడ 3 వ అంగన్వాడి కేంద్రం పరిధిలో చిన్న పిల్లలతో నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... గర్భిణీస్త్రీలు, బాలింతలు, 6 నెలల నుండి 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు దగ్గర్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో నమోదు కావాలని, ప్రభుత్వం వీరికోసం ప్రతిష్టాత్మకమైన పథకాలను అమలు చేస్తున్నదని,ప్రత్యేకించి చిన్న పిల్లలు, బాలింతలకు పౌష్టికాహార పంపిణీ, చిన్నపిల్లలకు పాఠశాల పూర్వ విద్యలో భాగంగా నేర్చుకోవాల్సిన అంశాలు తరగతి గదిలో నేరుగా విద్యనందించే విధానం కాకుండా, తొలిమెట్టు ఎలా ఉండాలన్న దానిపై ఏం బోధించాలనే దానిపై అంగన్వాడీ కేంద్రాల ద్వారా నేర్పించడం జరుగుతుందన్నారు. ఇందుకుగాను రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి కార్యక్రమాలను రూపొందిచాయని, వీటిని అంగన్వాడి స్థాయిలో అమలు చేయడం జరుగుతుందన్నారు. అందువల్ల తప్పనిసరిగా 5 సంవత్సరాలలోపు పిల్లలను స్థానికంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో నమోదు చేయాలని ఆమె పునరుద్ఘాటించారు. ఈ ర్యాలీలో జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, సిడిపివో హరిత, స్థానిక ప్రజా ప్రతినిధులు అల్లి సుభాష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.