14-05-2025 12:25:08 AM
జీహెచ్ఎంసీ కమిషనర్ను కోరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు, మే 13 : పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రామచంద్రాపురం, భారతీ నగర్, పటాన్ చెరు డివిజన్ల పరిధిలో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయిం చాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి కర్ణన్ ను పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు.
మంగళవారం హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బల్దియా కమిషనర్ తో ఎమ్మెల్యే ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. మూడు డివిజన్ల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులు, నిధుల సమస్యపై ఆయనకు వివరించారు.
ప్రధానంగా నూతన కాలనీలలో రహదారులు, అంతర్గత మురుగునీటి కాలువలు, పార్కులు, వీధి దీపాలు ఏర్పాటుకు వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు. పలు కాలనీలలో నిధుల కొరత మూలంగా అభివృద్ధి పనులు నిలిచిపోయాయని తెలిపారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కమిషనర్ కర్ణన్ త్వరలోనే నిధుల మంజూరుకు ఆదేశాలు జారీ చేస్తామని తెలిపినట్లు ఎమ్మెల్యేతెలిపారు.