calender_icon.png 13 June, 2025 | 11:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇద్దరి ప్రాణాలను బలిగొన్న వివాహేతర సంబంధం

10-06-2025 12:42:59 AM

పురుగుల మందు తాగిన ప్రియురాలు, అపవాదు భయంతో ఉరివేసుకున్న ప్రియుడు

మెదక్, జూన్ 9(విజయక్రాంతి): వివాహేతర సంబంధం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. పురుగుల మందు తాగిన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, అపవాదు తనపై వస్తుందన్న భయంతో అదే గ్రామానికి చెందిన యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం సుల్తాన్ పూర్ లో ఆదివారం జరిగింది.

వివరాల్లోకెళ్తే సుల్తాన్ పూర్ కు చెందిన మూడావత్ సునీత(28), భర్త శ్రీనివాస్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈనెల 3న ఇంట్లో ఎవరు లేని సమయంలో మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉంది. వెంటనే మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి ఆమెను తరలించారు. వైద్యుల సూచన మేరకు గాంధీకి తరలించి చికిత్స చేయించారు. శనివారం రాత్రి గాంధీలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సునీత మృతి చెందింది.

అదే గ్రామానికి చెందిన దరావత్ నాగరాజు (30)తో సునీతకు వివాహేతర సంబంధం ఉన్నట్టు గతంలో రెండుసార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి మాట్లాడుకున్నారు. గతంలో ఇద్దరు కలిసి నాందేడ్ కు వెళ్లారని పోలీస్ స్టేషన్ లో మృతురాలి భర్త ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇద్దరిని తీసుకువచ్చి పెద్దల సమక్షంలో నచ్చజెప్పి పంపారు. ఈ నెల 3న సునీత ఆత్మహత్యాయత్నం చేసుకోగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది.

సునీత మృతికి కారణం తానే అవుతానన్న భయంతో పొలం వద్ద మర్రిచెట్టుకు ఆదివారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తీసుకున్న మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్‌ఐ సత్యనారాయణలు ఘటన స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. ఇద్దరికీ గతంలో వివాహిత సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐతెలిపారు.