13-06-2025 12:00:00 AM
టీసీవీ గౌరవాధ్యక్షుడు తుమ్మల ప్రపుల్రామ్రెడ్డి
ముషీరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 ఏళ్లు అవుతున్నా సినిమా రంగంలో ఆంధ్ర సినీ పెద్దల ఆధిపత్యం ఇంకా కొనసాగుతున్నదని తెలంగాణ సినిమా వేదిక (టీసీవీ) గౌరవాధ్యక్షులు తుమ్మల ప్రపుల్ రామ్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర కన్వీనర్ లారా, కో-కన్వీనర్ మోహన్ బైరాగి తో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం గద్దర్ ఫిలిం అవార్డులను ఆంధ్ర సినిమాలకు ఇవ్వకూడదని హైకోర్టులో పిటిషన్ వేశామన్నారు. శుక్రవా రం వాదనను వినిపించబోతుందని, కోర్టు ద్వారా తెలంగాణ సినిమాకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఒక్కటై తెలంగాణ సినిమా రంగానికి అన్యాయం చేస్తున్నారని ఆరోపిం చారు.
జూనియర్ కమిటీని రద్దు చేయాలని, తెలంగాణ సినిమా రంగం లో పనిచేస్తున్న వారితో జూరి కమిటీ నిర్వహించి అవార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జి.రవి, టీసీవీ రాష్ట్ర నాయకులు, చంద్రన్న ప్రసాద్, సాయి, కృష్ణ స్వామి, తదితరులు పాల్గొన్నారు.