24 March, 2026 | 10:50 PM

అంగన్వాడీల సమస్యల పరిష్కారానికై అసెంబ్లీలో తీర్మానం చేయాలి

24-03-2026 09:13 PM

మంథని,(విజయక్రాంతి): మంథనిలో అంగన్వాడీలు సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం రెవెన్యూ డివిజనల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి రెవెన్యూ డివిజనల్ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడి వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు వనజరాని,  సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా అంగన్వాడీలకు కనీస వేతనం రూ.18 వేలు అమలు చేసి పీఎఫ్ సౌకర్యం కల్పించాలి.

  ఐసిడిఎస్ కు సరిపడా నిధులు కేటాయించాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్ ఈ పి చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడి కేంద్రాల్లోనే నిర్వహించాలని, 2026 ఎడ్యుకేషన్ పాలసీని సవరించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా అంగన్వాడీలకు ఒక పూట బడులను నిర్వహించాలని మే నెలలో టీచర్లకు ఆయాలకు ఇద్దరికీ ఒకేసారి ఎలాంటి ఆటంకాలు లేకుండా సెలవులు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా అంగన్వాడీలకు క్రమం తప్పకుండా వేతనాలు ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించి సమ్మె కాలపు ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకురాలు కే కుమారి, స్వరూప, సుగుణ, శోభ, సులోచన, భాగ్య, సుజాత, తదితర అంగన్వాడి టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.