03-05-2025 04:45:12 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం నిన్న వెలగపూడి వేదికగా ఘనంగా నిర్వహించింది. ఈ వేడకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా హాజరై ఏపీ రాజధాని పునర్నిర్మాణ పనులతో పాటు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అమరావతి పునఃప్రారంభ పనుల కార్యక్రమంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ పునర్విభన చట్టం 94(3) సెక్షన్ ప్రకారం నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదే పేర్కొన్నారు. నూతన రాజధానిలో మౌలిక సదుపాయాలు కల్పన కేంద్ర ప్రభుత్వం కల్పించాలన్నారు. విభజన చట్టంలో కేంద్రం విధులేంటో ఇంత స్పష్టంగా పేర్కొంటే.. మరి ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ కు ఇస్తున్నది ఏమిటి..? అని, ఆనాడు 2015లో మట్టి కొట్టారు. నేడు సున్నం కొట్టి వెళ్ళారు అని విమర్శించారు.
గత పదేళ్ల ఏళ్ల క్రితం ఏం చెప్పి ఆంధ్రులకు తీరని ద్రోహం చేశారో.. నేడు అవే అబద్ధాలను అందంగా చెప్పి ఘరానా మోసం చేశారని ఆరోపించారు. మళ్ళీ అభివృద్ధి చేస్తాం, భుజాలు కలుపుతాం అంటూ బూటకపు మాటలు చెప్పారని మోదీ సర్కార్ పై విర్చుకుపడ్డారు. 5 కోట్ల మంది కలల సౌధం అమరావతికి 2015 నుండి అన్ని చేశామని పచ్చి అబద్ధాలు చెప్పారని, అన్ని ఇస్తే మాకు రాజధాని నిర్మాణం ఇంతవరకు ఎందుకు కాలేదు..? అని షర్మిలా బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అమరావతి నిర్మాణానికి ఖర్చయ్యే లక్ష కోట్లలో ఒక్క రూపాయి అయినా ఇప్పటి వరకు ప్రకటించారా..?, రాజధాని నిర్మాణం కేంద్రం బాధ్యత అని హామీ ఇచ్చారా..?, కనీసం అమరావతికి చట్టబద్ధత ఇస్తున్నామని చెప్పారా?, పోనీ విభజన హామీలపై టైమ్ బాండ్ క్లారిటీ ఇచ్చారా..? అని అడిగారు. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు.
ప్రధాని మోదీని నమ్మి మళ్ళీ మళ్ళీ మోసపోతున్నట్లు తెలుసుకోవాలని, ఏదో ఉద్ధరిస్తారని, కాసులు కురిపిస్తారని నమ్మి ఒకసారి రాత్రి గోతిలో పడ్డ చంద్రబాబు మళ్ళీ మోడీని పిలిచి అదే గోతిలో పగలు పడ్డారని ఎద్దేవా చేవారు. ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ పక్షాన సూటిగా ప్రశ్నిస్తున్నామన్నారు. రాజధానికి కావాల్సింది అప్పులు కాదు.. నిధులు అని, రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని, అప్పు పుట్టనిదే జీతాలకు దిక్కులేదని చెప్పే మీరు రాజధాని నిర్మాణానికి ఎవరిని అడిగి రూ.60 వేల కోట్లు అప్పు తెస్తున్నారు..? అని ప్రశ్నించారు. వడ్డీల భారం మోసేదెలా..?, వరల్డ్ బ్యాంక్, ఏడీబీ, కేఎఫ్డబ్య్లూ, హడ్కోల దగ్గర రాష్ట్రాన్ని ఎందుకు తాకట్టు పెడుతున్నారు..?, ప్రభుత్వ భూములు అంటే ప్రజల ఆస్తి వాటిని అమ్మి రాజధాని ఎలా కడతారు..? అని అడిగారు. కేంద్రం మెడలు వంచే దమ్ములేక భావితరాల మీద అప్పు భారం ఎందుకు మోపుతున్నారో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలా డిమాండ్ చేస్తున్నామన్నారు.