calender_icon.png 21 June, 2025 | 6:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆమోదం సరే.. అమలేది?

21-06-2025 01:35:54 AM

  1. ఉద్యోగుల సమస్యలపై క్యాబినెట్ నిర్ణయాలపై వెలువడని ఉత్తర్వులు
  2. ఒక్క డీఏకు మాత్రమే జీవో జారీచేస్తూ సరిపెట్టుకున్న సర్కారు
  3. హెల్త్ కార్డులు, ట్రస్ట్, ప్రతినెలా రూ.700కోట్లు విడుదలపై ఊసేలేదు
  4. క్యాబినెట్ నిర్ణయాలను వెంటనే అమలుచేయాలంటున్న ఉద్యోగులు

హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్ల దీర్ఘకాలిక పెండింగ్ సమస్యల పరిష్కార అంశం ఒకడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది. జూన్ 5న జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంత్రిమండలి ఆమో దం తెలిపిన సంగతి తెలిసిందే. సమావేశం జరిగి పదిహేను రోజులు దాటుతున్నా ఇంతవరకు వాటికి సంబంధించిన నిర్ణయాలపై ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు.

దీంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. క్యాబినెట్‌లో ఆమోదం తెలిపినవాటిలో ఒక్క డీఏకు సంబంధించిన ఉత్తర్వులను మాత్రమే ప్రభుత్వం జారీచేసింది. మిగతా అంశాలను ఇంత వరకూ పట్టించుకోవడంలేదని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. వెంటనే వాటికి సంబంధించిన ప్రక్రియను మొదలుపెట్టేలా మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

ఉద్యోగులు ఎప్పటినుంచో హెల్త్ కార్డులివ్వాలని అడుగుతున్నారు.. ప్రస్తుతం హెల్త్‌కార్డులున్నా అవి అన్ని ఆస్పత్రుల్లో పనిచేయడంలేదు. వాటిపై నగదు రహిత వైద్యం చేసేందుకు ఆస్పత్రులు ముందుకు రావడంలేదు. ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోవడంతో వాటిని పరిగణలోకి తీసుకోకపోవడంతో వైద్యం చేసుకునేందుకు ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వారి జేబుల్లోంచి డబ్బును పెట్టుకోవాల్సి వస్తోంది. ఈక్రమంలోనే హెల్త్‌కార్డులు సక్రమంగా పనిచేసేలా న్యూహెల్త్ స్కీమ్‌ను తీసుకొచ్చి ట్రస్టును ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. అయితే ఈ పథకం కోసం ప్రతీ ఉద్యోగి రూ.500చొప్పున ఇవ్వాలని, ఏడాదిపాటు వాళ్లు జమచేసిన సొమ్ముకు సమానంగా రాష్ట్రప్రభుత్వం తరపున ఇవ్వాలని క్యాబినెట్‌లో నిర్ణయించారు.

దీని అమలుకు ట్రస్టును ఏర్పాటు చేసి అందులో అధికారులు, ఉద్యోగులు సభ్యులుగా ఉండేలా నిర్ణయించారు. అయితే దీనిపై ఉద్యోగ సంఘాలతో అధికారులు సమావేశమై మార్గదర్శకాలను, కమిటీని రూపొందించాల్సి ఉంటుంది. అప్పుడు ఈ ట్రస్టు ద్వారా సేవలు అందుతాయి. దీనికిగానూ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం మరోసారి చర్చించాల్సి ఉంటుంది. దీనికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

కానీ తదుపరి ప్రక్రియ ముందుకు సాగడంలేదని ఉద్యోగ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులకు ఇప్పుడు ఒకటి, మరొకటి వచ్చే ఏడాది ఏప్రిల్‌లో డీఏలు ఇస్తామని ప్రకటించినట్లుగానే వాటికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం ఇటీవల జారీ చేసింది. వీటితోపాటు రిటైర్‌మెంట్ బెనిఫిట్స్, మెడికల్ తదితర పెండింగ్ బిల్లులన్నీ కలిపి రూ.10వేల కోట్ల వరకు ఉన్నాయి.

వీటిని ఒకేసారి చెల్లించడం సాధ్యం కాకపోవడంతో ప్రతినెలా రూ.700కోట్లకు తగ్గకుండా చెల్లిస్తామని క్యాబినెట్‌లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం చెప్పినట్లుగా జూన్ నెలకు సంబంధించి రూ.700 కోట్లను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు. క్యాబినెట్‌లో ఆమోదించిన నిర్ణయాలు కూడా అమలుకాకపోవడంపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.

ఇదిలా ఉంటే క్యాబినెట్ నిర్ణయాలను అమలు చేయాలని, పెండింగ్ బిల్లును విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను పలువురు ఉద్యోగ సంఘాల నేతలు కలిసి కోరడంతో త్వరలోనే అమలు చేస్తామని ఆయన సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.

క్యాబినెట్‌లో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇవి..

* ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జాయింట్ స్టేట్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని, ఉద్యోగ సంఘాలకు గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించారు.

* సచివాలయంలో ఉద్యోగుల కోటా 12.5 శాతం ఉండాలని కోరారు. దీనికి కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

* జీవో 317లో ఇంకా కొన్ని విభాగాలను చేర్చాలని క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు.

* గత ఎన్నికల సమయంలో బదిలీచేసిన అధికారులను తిరిగి పాత స్థానాలకు పంపాలని ఉద్యోగుల డిమాండ్‌ను క్యాబినెట్ ఆమోదించింది.

* స్టేట్ లెవెల్ మెడికల్ ఇన్‌వాలిడేషన్ కమిటీని ఏర్పాటు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. దీన్ని కూడా ఆమోదించారు. నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటును ఆమోదించారు.

* డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీల సమావేశాలను రెగ్యులర్‌గా నిర్వహించడానికి ఆమోదం లభించింది.

* ఉద్యోగుల వాహన అద్దెలను వెంటనే క్లియర్ చేసి, ఇచ్చే ధరను పెంచాలనే విజ్ఞప్తిని క్యాబినెట్ ఆమోదించింది.

* రిటైర్డ్ ఉద్యోగులను మళ్లీ విధుల్లోకి తీసుకోకూడదని నిర్ణయించింది.

* గ్రామపంచాయతీ కార్యదర్శుల క్యాడర్‌ను పంచాయతీ గ్రేడింగ్ ప్రకారం చేయాలని నిర్ణయించింది.

* వీటితోపాటు ఇతర పలు అంశాలు క్యాబినెట్‌లో చర్చకు వచ్చి ఆమోదం పొందాయి.