8 May, 2026 | 5:37 AM

ఆర్థిక సంస్కరణల ఆర్కిటెక్టు

28-12-2024 02:49 AM
  1. తెలంగాణతో మన్మోహన్‌కు ప్రత్యేక అనుబంధం
  2. అంత్యక్రియలకు కేటీఆర్‌తోపాటు ఎంపీలు  
  3. బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు

హైదరాబాద్, డిసెంబర్ 27 (విజయక్రాంతి): దేశ ఆర్థిక సంస్కరణల ఆర్కిటెక్టుగా మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ అమోఘమైన సేవలందించారని బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఆయనకు తెలంగాణతో ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నారు.

శనివారం జరిగే అంత్యక్రియలకు పార్టీ తరఫున బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు ఎంపీలు  హాజరై నివాళులర్పిస్తారని కేసీఆర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మన్మోహన్‌సింగ్ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేసిన తనకు ఆయనతో వ్యక్తిగత అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు.

తెలంగాణ ఉద్యమ సమయం నుంచి రాష్ర్ట ఏర్పాటు దాకా వారి సహకారాన్ని తెలంగాణ సమాజం మరువలేదన్నారు. టీఆర్‌ఎస్‌కు ప్రతి సందర్భంలో మనోధైర్యాన్నిస్తూ అండగా నిలిచారని పేర్కొన్నారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలోనే  తెలంగాణ రాష్ర్టం సిద్ధించిందని వివరించారు. తెలంగాణ సమాజానికి అత్యంత ఆప్తుడైన మన్మోహన్‌సింగ్‌కు నివాళి అర్పించాలని బీఆర్‌ఎస్ నిర్ణయించిందన్నారు.