రేప్, మర్డర్ చేసినా మీకు ఫర్వాలేదా?
కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, జూన్ 8 : ఎయిర్పోర్టులో తనను చెంపదెబ్బ కొట్టిన మహిళా కానిస్టేబుల్కు మద్దతిస్తున్న వారిని ఉద్దేశిస్తూ బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై మహిళలపై రూప్లు, మర్డర్లు జరిగినా మీకేం ఫర్వాలేదా? అంటూ ఎక్స్ వేదికగా స్పందించారు. గురువారం చండీగఢ్ విమానాశ్రయంలో కుల్విందర్ కౌర్ అనే సీఐఎస్ఎఫ్ మహిళ కానిస్టేబుల్ చెంపదెబ్బ కొట్టిన ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కానిస్టేబుల్కి మద్దతిస్తున్న వారిని ఉద్దేశించి శనివారం ఎక్స్ వేదికగా కంగనా పోస్టు పెట్టింది.
‘అత్యాచారానికి పాల్ప డ్డవారు, ఇతర నేరాలు చేసిన వారెవరైనా భావోద్వేగ, మానసిక, ఆర్థికపర మైన కారణాలు చెబుతుంటారు. చేసిన నేరానికి వారిని న్యాయస్థానాలు దోషి గా తేల్చి శిక్ష విధిస్తాయి. అలా కాదని వారి భావోద్వేగాలను పరిగణలోకి తీసుకొని శరీరాన్ని తాకడం, ఇతరులపై దాడి చేయడం వంటి ఘటనలను మీరు సమర్థిస్తే.. అత్యాచారాలు, హత్యలు జరిగినా మీకేం ఫర్వాలేదనే అర్థం. మీ మానసిక పరిస్థితిపై దృష్టిపెట్టుకోవాలి. యోగా, ధ్యానం చేయండి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.






