31-05-2025 08:52:57 PM
బీజేపీ నేత అరిగెల నాగేశ్వరరావు
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆదివాసీల హక్కులను ప్రభుత్వాలు కాపాడాలని బిజెపి నేత అరిగెల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఆదిమా గిరిజన భూ రక్షణ పోరాట కమిటీ, రాజ్ గొండ్ సేవాసమితి, గోండ్వాన పంచాయతీ రాయి సెంటర్ ఆధ్వర్యంలో ఆదిమ గిరిజనులపై ఆటవిశాఖ అధికారుల వేధింపులకు వ్యతిరేకంగా చేపడుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని శనివారం ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా అరిగెల నాగేశ్వరరావు మాట్లాడుతూ... అటవీ నీ నమ్ముకొని జీవిస్తున్న గిరిజనులను వేధింపులకు గురి చేయడం ఫారెస్ట్ అధికారులు మానుకోవాలన్నారు.అడవుల రక్షణలో గిరిజనులు భాగస్వాములై ఉన్నారన్న విషయాన్ని మర్చిపోవద్దని గుర్తు చేశారు.కేవలం వారి జీవనం కోసం మాత్రమే కోడు భూములను నమ్ముకొని బతుకు పోరాటం చేస్తున్నారన్నారు. ప్రభుత్వాలు రెవెన్యూ పట్టాలు, అసైన్మెంట్ పట్టాలు ఇచ్చినప్పటికీ అధికారులు సాగు చేయకుండా అడ్డుకోవడం దారుణం అన్నారు. ఆదివాసి గ్రామాల కు రహదారి నిర్మాణం చేపట్టేందుకు అడ్డంకిగా ఉన్న అటవీ అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆటే హక్కు పద్యాలు కలిగిన రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.గిరిజనులకు విద్యుత్ సదుపాయం కల్పించి గిరి వికాసం పథకం ద్వారా బోర్లు, బావులు వేయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆదివాసీల భూముల చుట్టూ అటవీ అధికారులు చెట్లు నాటడం కోసం వేస్తున్న ట్రెంచులను వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ఆదివాసీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు అర్జున్ మాస్టర్, జ్ఞానేశ్వర్, కిషన్ రావు, బిజెపి నాయకులు శ్రీకాంత్ ,నవీన్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.