calender_icon.png 11 May, 2025 | 3:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలిసెట్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

11-05-2025 12:12:12 AM

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల,(విజయక్రాంతి): ఈ నెల 13 వ తేదీన పాలిసెట్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. పాలిసెట్ నిర్వహణ పై ఆయా శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శనివారం సమీక్ష సమావేశం  నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ పాలిటెక్నిక్ డిప్లమా కోర్సుల్లో ప్రవేశానికి విద్యార్థులకు జిల్లాలో ఈ నెల 13 వ తేదీన ఉదయం 11 నుంచి 1.30 గంటల వరకు టీజీ పాలిసెట్ సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని  ఆదేశించారు. జిల్లాలో మొత్తం 2136 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని, వీరి కోసం 7 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

ప్రతి కేంద్రంలో సీసీ కెమెరా తప్పనిసరిగా ఉండాలని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అవసరమైన బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. ప్రశ్నా పత్రాల తరలింపు అవసరమైన బందోబస్తు కల్పించాలని, కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేయాలని పోలీసులను కలెక్టర్ ఆదేశించారు. పరీక్షా సమయంలో పరీక్ష కేంద్రాల వద్ద  కరెంట్ కోతలు ఉండవద్దని, ఫస్ట్ ఎయిడ్ కిట్, ఓఆర్ఎస్ ప్యాకేట్లతో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని సెస్, వైద్య అధికారులకు సూచించారు.  సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య,సిరిసిల్ల రెవెన్యూ డివిజన్ అధికారి వెంకటేశ్వర్లు, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకరాచారి, జిల్లా వైద్యాధికారి డా.రజిత, సిరిసిల్ల తహసీల్దార్ మహేష్, సెస్, ఆర్.టి.సి, మున్సిపల్ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.