07-06-2025 12:38:49 AM
సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్
సంస్థాన్ నారాయణపూర్, జూన్ 6 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాక్షస పాలన కొనసాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని రాష్ట్ర సర్పంచ్ల సంఘం అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్ అన్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న మాజీ సర్పంచ్లను అరెస్టు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.అప్రజాస్వామికంగా మాజీ సర్పంచులను అరెస్టు చేశారని మండిపడ్డారు.
పెండింగ్ బిల్లులను చెల్లించాలని అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన ఎలాంటి పరిష్కారం చూపకుండా అభివృద్ధి చేసిన సర్పంచుల ను అక్రమంగా అరెస్టు చేయడం అవివేకం అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ప్రజల దృష్టిని మరల్చుతూ ఎప్పటికప్పుడు దాటవేత ధోరణి అవలంబిస్తున్న రేవంత్ రెడ్డి ప్రజలకు తప్పక సమాధానం చెప్పాలని అన్నారు.
ప్రజా పాలనలో పథకాల అమలుకు నిధులు లేవని చెప్పిన ముఖ్యమంత్రి కొత్తగా కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపనలు చేసి ఎవరిని మోసం చేస్తారని అన్నారు.ఇప్పటికైనా మాజీ సర్పంచుల బిల్లులు చెల్లించాలని లేని యెడల రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పక ఓటమి చవిచూడాల్సి వస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు నర్రి నరసింహ, గ్రామ శాఖ అధ్యక్షులు తెలంగాణ బిక్షం,గుడిమల్కాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు సిద్ధగోని శ్రీనివాస్ గౌడ్, సర్పంచుల సంఘం మండల ఉపాధ్యక్షులు పాండురంగ నాయక్, మాజీ సర్పంచులు యాదవ రెడ్డి, కట్టెల బిక్షపతి, జక్కర్తి పాపయ్య, మన్నె పుష్పలత చిత్రసేనారెడ్డి, దోనూరు శేఖర్ రెడ్డి, జింకల ఫకీర్ తదితరులు పాల్గొన్నారు.