28 April, 2026 | 2:19 AM

పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ

28-04-2026 12:25 AM
  1. సభ్యుల ప్రైవసీకి పెద్దపీట వేయాలి 
  2. పబ్లిక్ గార్డెన్‌లో ప్రత్యేకంగా క్లబ్ ఏర్పాటు చేయాలి 
  3. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం 

హైదరాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): రాష్ట్ర శాసనసభ ప్రాంగణం రూపురేఖలను పూర్తి గా మార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణం తరహాలో రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణాన్ని కూడా హుందాగా, అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో సౌకర్యాలు, సభ్యుల ప్రైవసీ, భద్రతపై అధికారులతో సీఎం కీలక సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. అసెంబ్లీ ప్రాంగణం కేవలం కార్యాలయంగా కాకుండా, సభ గౌరవం ప్రతిబింబించేలా పార్లమెంట్ తరహాలో ఉండాలని స్పష్టంచేశారు. పబ్లిక్ గార్డెన్‌లో అసెంబ్లీ సభ్యుల కోసం ప్రత్యేకంగా ఓ క్లబ్‌ను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. సభ్యుల ఆరోగ్యంపై దృష్టి సారించి వాకింగ్ ట్రాక్, క్రీడల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు.

శాసనసభ సభ్యులకు సభా ప్రాంగణంలో తగినంత ప్రైవసీ ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇతరుల జోక్యం లేకుండా సభ్యులు తమ చర్చలు జరుపుకునే వాతావరణం కల్పించాలని అధికారులకు దిశానిర్దేశంచేశారు. వచ్చే అసెంబ్లీ సమా వేశాల నాటికి సెంట్రల్ హాల్ పనులను పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని డెడ్‌లైన్ విధించారు.

అభివృద్ధి పనులు చేస్తున్న క్రమంలో చారిత్రక కట్టడాలకు, హెరిటేజ్ భవనాలకు ఎలాంటి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అసెంబ్లీ ప్రాంగణంలోకి అనధి కార వ్యక్తుల ప్రవేశం లేకుండా భద్రతను అత్యంత పటిష్టం చేయాలని, భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేయాలని సూచించారు.