కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి, రైతన్నలకు శాపం
- మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
గంగాధర,(విజయక్రాంతి): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో అన్నదాతల పరిస్థితి ఆగమాగం అయిందని చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్ అన్నారు. శనివారం గంగాధర మండలం మధురానగర్ లో స్థానిక బిఆర్ఎస్ నాయకులతో కలిసి ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా రైతు వ్యతిరేక విధానాలపై నిరసనలు చేపడుతున్నామని తెలిపారు.
ఎన్నికల సమయంలో ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని, అన్ని పంటలకు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. ఇటీవల కేంద్రం కేటాయించిన కోటా మేరకే పంటలను కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసిందన్నారు. ఎన్నికల ముందు చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు మాట మార్చడం రైతులను మోసం చేయడమేనని ఆరోపించారు.
దేశానికి అన్నం పెట్టే రైతన్నను మోసం చేసే ప్రభుత్వాలను ప్రజలు క్షమించరని అన్నారు. రైతులు పండించే ప్రతి పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని, ఎన్నికల హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో రైతులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని సుంకె రవిశంకర్ హెచ్చరించారు. ఆయన వెంట చొప్పదండి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.






