calender_icon.png 26 June, 2025 | 6:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్తు పదార్థాల వినియోగాన్ని నిరోధించేందుకు అవగాహన ర్యాలీ

26-06-2025 01:15:21 AM

ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు

ఎల్లారెడ్డి, జూన్ 25,(విజయ క్రాంతి): మత్తు పదార్థాల వినియోగం రోజు రోజుకు తీవ్రమవుతోందని, ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో దేశ యువత నిర్వీర్యమయ్యే ప్రమాదముందని ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసరావు అన్నారు.బుధవారం మత్తు పదార్ధాలు, మాదక ద్రవ్యాల నిరోధక, నివారణ అధికారుల అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు.

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా, జిల్లా పోలీసు అధికారి  రాజేశ్ చంద్ర ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు, 25న ఎల్లారెడ్డి పోలీసుల ఆధ్వర్యంలో మత్తు పదార్థాల వినియోగాన్ని నిరోధించేందుకు బహుళ శాఖల సమన్వయంతో మేగా అవగాహన ర్యాలీ, సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఎల్లారెడ్డి అంబేద్కర్ చౌక్ నుండి బస్టాండ్ వరకు మాదకద్రవ్యాలపై అవగాహన ర్యాలీ నిర్వహించి,ర్యాలీలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోలీసులు, అధికారులు పాల్గొని నినాదాలతో మత్తు వ్యసనానికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. బస్టాండ్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి, సందేశాత్మక కార్యక్రమం నిర్వహించారు.

అనంతరం బాలాగౌడ్ ఫంక్షన్ హాల్ లో జరిగిన సమావేశంలో డీఎస్పీ శ్రీనివాస్ రావ్, మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక హాని గురించి వివరించారు.‘మత్తు పదార్థాల మత్తు కొన్ని గంటల  పాటు ఉండొచ్చు. ఈ సమయంలో యువత ఆలోచన చేసే స్థితిలో ఉండరు. ఇది హత్యలు, లైంగిక దాడులు, దొంగతనాలు వంటి నేరాలకు దారి తీస్తోంది. గ్రామీణ ఆర్థిక స్థితిని కూడా ప్రభావితం చేస్తోంది‘ అని తెలిపారు.

సీఐ బీ. రవీందర్ నాయక్  మాట్లాడుతూ  ‘నార్కోటిక్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వల్ల యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. కేసులు నమోదు చేయడం కంటే వారికి మార్గనిర్దేశం చేయడమే పోలీసుల ధ్యేయం‘ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ షకీర్ హైమద్, మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్, ఎల్లారెడ్డి, ఎంఈఓ ఎల్. రాజులు ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డా. రవీంద్ర మోహన్, వైద్య సిబ్బంది, ప్రభుత్వ, జూనియర్ కాలేజ్ లెక్చరర్ సలాం నిజాం, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,, ఉపాధ్యాయులు, లెక్చరర్లు, విద్యార్థులు రెవెన్యూ ఇన్స్పెక్టర్, వివిధ శాఖల అధికారులు,ఎస్‌ఐలు, పోలీసు, ఎక్సైజ్, రెవెన్యూ, మున్సిపల్, ఆరోగ్య శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.