రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు
వాంకిడి,(విజయక్రాంతి): రైతుల అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికల కార్యక్రమంలో భాగంగా వాంకిడి మండలంలోని రైతు వేదికల్లో సోమవారం విస్తృత స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించారు. గ్రామ సర్పంచుల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాల్లో రైతులకు వివిధ వ్యవసాయ అంశాలపై మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మండల విస్తరణ అధికారులు మాట్లాడుతూ రైతులు పంటల దిగుబడులు పెంచుకునేందుకు భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు.
విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారా ఖర్చులు తగ్గించి లాభాలు పెంచుకోవచ్చని తెలిపారు. అలాగే పంటలకు ఎరువులు సరైన మోతాదులో, సరైన సమయంలో వాడే విధానంపై రైతులకు వివరంగా అవగాహన కల్పించారు. ఇక ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ ఐడి నమోదు చేసుకోవాలని అధికారాలు సూచించారు. దీనివల్ల ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు సులభంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు.






