13-09-2025 08:22:26 PM
వైద్యుల నిర్లక్షమే కారణమంటూ బంధువుల ఆందోళన..
వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువు శనివారం మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందినట్లు బాధితులు ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రహ్మాజీ వాడి గ్రామానికి చెందిన అఖిలకు శుక్రవారం అర్ధరాత్రి పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే ఆమె కుటుంబ సభ్యులు కామారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మొదటి కాన్పు కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అఖిల నొప్పులు భరించలేక పోతుందని ఆపరేషన్ చేసి పాపను తీయాలని వైద్యులకు సూచించిన వారు సాధారణ కాన్పు చేసేందుకు మొగ్గు చూపారు. వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే నవజాత శిశువు మృతి చెందినట్లు బాధితులు ఆరోపించారు. ఈ విషయంపై ఆసుపత్రి సూపర్డెంట్ ను వివరణ కోరగా శిశువు ఉమ్మ నీరు పిర్చుకోవడం వల్లనే మృతి చెందినట్లు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం ఏం లేదని తెలిపారు. పోలీసులు వచ్చి సముదాయించడంతో ఆందోళన విరమించారు.