07-06-2025 06:55:25 PM
ముస్లిం మైనార్టీలను వెలివేసే కేంద్రం కుట్రలను తిప్పికొట్టాలి..
కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు..
ముస్లీం కుటుంబాలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన కూనంనేని..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): త్యాగానికి, సామరస్యానికి ప్రతీక బక్రీద్(Eid al-Adha) పండుగ అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు(MLA Kunamneni Sambasiva Rao) అన్నారు. బక్రీద్ పండుగను పురస్కరించుకొని శనివారం పట్టణ పరిధిలోని బొడగుట్ట ఈద్గా మైదానంలో, పాల్వంచలోని ఇంద్ర కాలనీ వద్ద గల ఈద్గాలో జరిగిన ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. ముస్లీం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ... ప్రజాస్వామ్య భారత దేశంలో అన్ని పండుగలకు కులమతాలకతీతంగా జరుపుకోవడం హర్షణీయమన్నారు. రాగద్వేశాలు వీడనాడి ప్రతి ఒక్కరు సామరస్యా భావాలతో కలిసి మెలిసి జీవించాలని తద్వారా సమాజంలో శాంతిని నెలకొల్పాలన్నారు. పేద, ధనిక తారతమ్యం లేకుండా పండుగ ఉత్సవాలను అందరూ జరుపుకోవాలని, పండుగలు జరుపుకునే స్థితిలో లేని పేదలకు తమవంతు కర్తవ్యంగా తోడ్పాటును అందించి పండుగ వేడుకల్లో భాగస్వామ్యం చేయడం అభినందనీయమన్నారు. కేంద్రంలోని మోడీ సర్కార్ ముస్లిం మైనార్టీలను దేశద్రోహులుగా ముద్రిస్తూ వెలివేసే కుట్రలకు పాల్పడుతోందన్నారు.
ముస్లిం వ్యతిరేఖ చట్టాలను తీసుకువస్తూ ముస్లిం మైనార్టీలను ముప్పుతిప్పలు పెడుతోందన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి పబ్బంగడుపుకునే నీచ రాజకీయాలకు పాల్పడుతోందని, ఈ కుయుక్తులను కలిసికట్టుగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, సబ్ డివిజన్ పోలీస్ అధికారి రహమాన్, మైనార్టీ సంఘాల రాష్ట్ర నాయకులు డాక్టర్ నయీమ్ ఖురేషి, నాయకులు వాసిరెడ్డి మురళి, అన్వర్ అలీ, అమీర్ ఖాద్రి, అయుబ్, ఇస్మాయిల్ ఖాన్, అబ్దుల్ రబ్, ఆబిద్ హుస్సేన్, కరీం పాషా, జావేద్, తదితరులు పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు.