31-05-2025 01:10:32 AM
నల్లగొండ టౌన్, మే 30 : మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను సోదర భావంతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కోరారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మత పెద్దలతో శాంతి సంఘం సమావేశం నిర్వహించారు.
రాబోయే బక్రీద్ పండగ పర్వదినాన్ని శాంతియుత వాతావరణంలో పరస్పరం మతాలను గౌరవించుకుంటూ పండుగ జరుపుకోవాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా పండగలను ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.ప్రజలంతా పండుగలను మతసామరస్యంతో జరుపుకునే విధంగా ఆయా మతాల పెద్దలు ప్రజల్లో సమన్వయం ఏర్పడేలా చేయాలన్నారు.
ఏదైనా సమస్య ఉంటే సామరస్య పరిష్కారానికి పోలీస్ అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటారని అన్నారు. ముఖ్యంగా యువత ఆవేశంతో చేస్తున్న చిన్న తప్పులు శాంతి భద్రతల సమస్యగా తలెత్తే ప్రమాదం ఉంటుందని కాబట్టి వివిధ వర్గాల మత పెద్దలు యువతకు సమన్వయం పాటించేలా దిశానిర్దేశం చేయాలని అన్నారు.
శాంతి సమావేశంలో నల్లగొండ డిఎస్పీ శివరాం రెడ్డి, వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, టూ టౌన్ సిఐ రాఘవరావు, ట్రాఫిక్ సిఐ మహాలక్ష్మయ్య ఎస్ఐ లు గోపాల్ రావు, శంకర్, జయకర్, వివిధ కులాల మత పెద్దలు హఫీస్ ఖాన్, గోలి మధుసూదన్ రెడ్డి, హశం, అహ్మద్ కలీం, బండారు ప్రసాద్, క్రిస్టోఫర్, శౌరయ్య, ఎలిజల నరసింహ, కౌన్సిలర్లు సమద్, బషీర్, అమీర్, అభిమన్యు శ్రీను, బాబా, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.