26-06-2025 04:55:57 PM
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ...
జయశంకర్ భూపాలపల్లి/మహబూబాబాద్ (విజయక్రాంతి): భూపాలపల్లి జిల్లాలో 2024-25 ఆర్థిక సంవత్సరం మొత్తం రుణాలు లక్ష్యాన్ని రూ.2565.06 కోట్లుగా నిర్ణయించగా, రూ.1923.32 కోట్లు సాధించడం ద్వారా 74.98 శాతం పురోగతి సాధించారని, ప్రతి సెక్టార్ లో నిర్దేశించిన రుణ లక్ష్యం ప్రకారం రుణాల మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(District Collector Rahul Sharma) అధికారులను ఆదేశించారు. గురువారం ఐడిఓసి కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కన్సల్టేటివ్ కమిటీ, జిల్లా స్థాయి రివ్యూ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని బ్యాంకులు రుణాలు లావాదేవీలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు, వార్షిక క్రెడిట్ ప్లాన్ 2024-25 ప్రకారం మార్చి 31 నాటికి బ్యాంకుల ప్రగతిని సమీక్షించారు.
వ్యవసాయ రంగంలో రూ.2055.42 కోట్ల లక్ష్యంతో పోలిస్తే రూ.1219.48 కోట్లు మంజూరు చేసి 59.33 శాతం పురోగతి సాధించారని తెలిపారు. షార్ట్ టర్మ్ క్రాప్ రుణాలు 1344.57 కోట్లు కాగా 660.10 కోట్లు లక్ష్యం సాధించారని తెలిపారు. ఎం ఎస్ ఎం ఈ రంగంలో 96.73 కోట్లు రుణాలు మంజూరు లక్ష్యం కాగా, 60.77 కోట్లు రుణాలు ఇచ్చారని, విద్యా రుణాలు 18.01 కోట్లు లక్ష్యం కాగా 7.23 కోట్లు రుణాలు ఇచ్చారన్నారు. గృహ నిర్మాణ రుణాలు 52.76 కోట్లు లక్ష్యం కాగా 3.14 కోట్లు మాత్రమే ఇచ్చారని రుణాలు మంజూరు పురోగతితో వెనుకబాటులో ఉన్నదని లక్ష్యం మేర రుణాలు మంజూరు చేయాలని సూచించారు.
ఇతర ప్రాధాన్యతా రంగాలకు 12.37 కోట్లు రుణాలు 38.48 కోట్లు రుణాలు మంజూరు చేసారని, అలాగే ప్రాధాన్యత రంగాలకు కూడా నిర్దేశించిన లక్ష్యం మేర రుణాలు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. నాన్ ప్రైయారిటీ రంగంలో రూ.330.77 కోట్ల లక్ష్యంతో పోలిస్తే రూ.594.22 కోట్లు మంజూరు చేయడం ద్వారా 179.65 శాతం పురోగతి సాధించారన్నారు. బ్యాంకర్లు వ్యవసాయ, విద్యా, గృహ రుణాలు. మంజూరు చేయాలని, గ్రామీణాభివృద్ధికి మరింత కృషి చేయాలని, ముఖ్యంగా హౌసింగ్ లోన్లు, విద్యా లోన్లలో పురోగతి పెంచాలని సూచించారు. రైతులకు, చిన్న, మధ్య తరహా వ్యాపారాల వారికి అవసరమైన క్రెడిట్ సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని బ్యాంకర్లను ఆదేశించారు. కొత్తపల్లి గోరి, చల్లగరిగే తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సేవలపై రైతులు నుండి ఫిర్యాదులు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పరిస్థితి ఇలానే ఉంటే స్టేట్ కమిటీకి ఫిర్యాదు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి బ్యాంక్ లింకేజీ రుణాలు ఇవ్వాలని సూచించారు. అవసరమైన రుణాలను సకాలంలో అందించి ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అనంతరం 2025-26 జిల్లా వార్షిక రుణ ప్రణాళిక 2920.33 కోట్లను ఆమోదించి, వార్షిక రుణ ప్రణాళిక పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఎల్డీఎం తిరుపతి, ఆర్బీఐ ఎల్డిఓ సాయి తేజారెడ్డి, నాబార్డు డిడిఎం చంద్ర శేఖర్, ఎస్బిఐ ఆర్ఎం సుబ్బారావు, టిజిబి ఆర్ ఎం ప్రభుదాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.