06-01-2026 12:16:30 AM
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 5, (విజయక్రాంతి): జిల్లాలోని అన్ని బ్యాంకులు సరైన భద్రతను ఏర్పాటు చేసుకోవాలని ఎస్పి రోహిత్ రాజు బ్యాంక్ అధికారులను ఆదేశించారు. ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని అన్ని బ్యాంకుల అధికారులతో సోమవారం ఎస్పీ సమావేశమయ్యారు. ప్రధానంగా ఏటిఎంలలో జరుగుతున్న చోరీలు బ్యాంకులలో జరుగుతున్న దొంగతనాలను ఉద్దేశించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాంటి సంఘటనలు జిల్లాలో జరగకుండా బ్యాంకు అధికారులు తమ తమ బ్యాంకులకు సంబంధించి పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. బ్యాంకుల లోపల, వెలుపల అన్ని ప్రదేశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుని, నిరంతర పర్యవేక్షణ ఉండేలా చూసుకోవాలన్నారు.
బ్యాంకులలో ఉండే సెక్యూరిటీ అలారం యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఏటీఎంలలో నగదును లోడ్ చేసేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని,అక్కడ సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలని సూచించారు. ఏటీఎం ల వద్ద సెక్యూరిటీ గార్థులను ఏర్పాటు చేసుకోవడం ఉత్తమమని తెలిపారు. సామాజిక బాధ్యతలో భాగంగా సైబర్ క్రైమ్స్ పై బ్యాంకుల తరఫునుండి కూడా జిల్లా ప్రజలకు నిత్యం అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందులో భాగంగా కరపత్రాలను,పోస్టర్లను తయారుచేసి ముఖ్యమైన ప్రదేశాల్లో అతికించాలని సూచించారు.సైబర్ నేరాల బారిన పడి నగదును కోల్పోయిన బాధితులకు నేరగాళ్ల అకౌంట్లలో ఫ్రీజ్ చేయబడిన నగదును త్వరితగతిన వారికి అందేలా పోలీస్ శాఖతో సమన్వయం పాటిస్తూ చర్యలు తీసుకోవాలని తెలియజేశారు.