calender_icon.png 23 September, 2025 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ సంస్కృతి, ప్రతిబింబించేలా బతుకమ్మ సంబురాలు

23-09-2025 01:27:15 AM

కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి 

నిజామాబాద్, సెప్టెంబర్ 22 (విజయ క్రాంతి) : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా బతుకమ్మ సంబు రాలను జిల్లాలో వైభోపేతంగా నిర్వహించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారు లను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం ఆయ న వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశమై బతుకమ్మ వేడుకల నిర్వహణ కోసం చేపట్టాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు.

ఈ ఉత్సవాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నేపధ్యంలో, జిల్లాలోని అన్ని పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాలలో బతుకమ్మ శోభ ఉట్టిపడేలా వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. కలెక్టరేట్ తో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుద్దీపాలతో అందంగా ముస్తాబు చేయాలని, ముఖ్య కూడళ్ళు, జన సంచారంతో రద్దీగా ఉండే ప్రదేశాలలో హోర్డింగ్స్, బతుకమ్మ నమూనాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

బతుకమ్మ ఆడే ప్రదేశాలను, నిమజ్జనం చేసే చెరువులు ఇతర నీటి వనరుల వద్ద లైటింగ్, సౌండ్ సిస్టమ్ వంటి వసతులను కల్పించాలని, పరిసరాలను శుభ్రం చేయించి ఆయా ప్రదేశాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని అన్నారు. బతుకమ్మలను నిమజ్జనం చేసే చెరువులు, నీటి వనరుల వద్ద ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని, గజ ఈతగాళ్ళను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ నెల 26న ఎడపల్లి మండలం అలీసాగర్ రిజర్వాయర్ వద్ద బతుకమ్మ ఉత్సవాన్ని అట్టహాసంగా నిర్వహిచడం జరుగుతుందని, ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, పెద్ద ఎత్తున మహిళలు, యువతులు, బాలికలతో పాటు మహిళా ఉద్యోగులు పాల్గొనేలా చూడాలని, ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు. ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగే బతుకమ్మ ఉత్సవాలలో అన్ని శాఖలు భాగస్వాములు కావాలని, ప్రతీ రోజు ఒక శాఖ తరఫున బతుకమ్మ పండుగను నిర్వహించాలని, 30వ తేదీన సద్దుల బతుకమ్మను పెద్ద ఎత్తున నిర్వహించాలని అన్నారు.

అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తూ, జిల్లాలో బతుకమ్మ వేడుకలు అట్టహాసంగా జరిగేలా కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ సాయాగౌడ్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, మెప్మా పీ.డీ రాజేందర్, డీ.పీ.ఓ శ్రీనివాస్ రావు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజశ్రీ, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ సురేష్ కుమార్, పంచాయతీరాజ్ ఈ.ఈ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొన్న కలెక్టర్ 

కామారెడ్డి, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ పాల్గొన్నారు. కలెక్టరేట్  మహిళా ఉద్యోగులతో బతుకమ్మ పాటలతో పాటలు ఆడారు. మహిళలను ఉత్తేజపరిచారు.

తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనంగా నిలుస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగకు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. మహిళలు ఎంతో ఉత్సవంతో బతుకమ్మ ఆటలు ఆడడం వల్ల ఎంతో ఉల్లాసం, ఐకమత్యం వెళ్లి వీరుస్తుందన్నారు. ప్రతి సంవత్సరం బతుకమ్మ ఉత్సవాలలో మహిళలు పాల్గొని సంబరాలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు.