బీసీ బంద్ బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న బంద్
హైదరాబాద్: సింగరేణి కార్మికులకు దీపావళి నోనస్ ఇవాళ రూ. 400 కోట్లు చెల్లిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Shri Bhatti Vikramarka) పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ సంస్థ సింగరేణి అన్నారు. తొలిసారిగా సైంటిఫిక్ గా కుల గణన నిర్వహించామని భట్టి విక్రమార్క తెలిపారు. సర్వే ద్వారా వచ్చిన సమాచారంతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించామని వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లును ఏకగ్రీవంగా పాస్ చేయించామని స్పష్టం చేశారు. 2018 లో బీఆర్ఎస్ ప్రభుత్వం 50 శాతం రిజర్వేషన్లు మించొద్దని చట్టం చేసిందని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన 50 శాతం రిజర్వేషన్ పరిమితిని కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేసిందని సూచించారు.
బీసీ రిజర్వేషన్ బిల్లును(BC Reservation Bill) కేంద్రప్రభుత్వం అడ్డుకుంటోందని భట్టి విక్రమార్క ఆరోపించారు. బీజేపీ నైజం ఏంటో దేశప్రజలకు తెలిసిందన్నారు. బీసీ రిజర్వేషన్లపై కలిసేందుకు ప్రదాని నరేంద్ర మోదీ సమయం కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశామని గుర్తుచేశారు. బీజేపీ వల్లే బీసీలకు అన్యాయం జరుగుతోందని భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నిర్ణయం తీసుకోకపోవడం వల్ల న్యాయస్థానాల్లో నిలిచిపోతుందన్నారు. బీసీ రిజర్వేషన్లను బీజేపీ ఎందుకు అడ్డుకుంటోంది? అని ఉప ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సిద్ధంగా ఉన్నారని సూచించారు. బీసీ రిజర్వేషన్లపై అడ్డుకుంటూ బీజేపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలు అమాయకులేం కాదు.. రేపు అంతా బీసీ బంద్(BC Bandh)లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీల బంద్ బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న బంద్ అన్నారు. బంద్ కు అన్ని వర్గాలు మద్దతు ఇవ్వాలని కోరారు. కోర్టు తీర్పు కాపీ వచ్చాక బీసీ రిజర్వేషన్లపై న్యాయనిపుణులతో మాట్లాడి 23న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తామని భట్టి విక్రమార్క వెల్లడించారు.






