ఇంటర్ ఫలితాల్లో బీసీ గురుకులాలు ఆదర్శం
ఇప్పటికైనా ప్రభుత్వం సొంత భవనాలను నిర్మించాలి
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్,ఏప్రిల్ 13(విజయక్రాంతి): ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో బీసీ గురుకుల కాలేజీలలో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్లతో, ఫలితాలలో అన్ని పాఠశాలను అధిగమించి స్టేట్ ఫస్ట్ రావడం గర్వకారణం, ఆదర్శప్రాయామని రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం 18 బీసీ సంఘాల సమావేశానికి గొరిగే మల్లేష్ అధ్యక్షతన అభినందన సమావేశం ఏర్పాటు చేసి బీసీ గురుకులాలలో బోధన సిబ్బంది గురువులను అభినందించారు.
30 కాలేజీలలో 100% రావడం చారిత్రాత్మకమన్నారు. 9 మందికి స్టేట్ ర్యాంకులు రావడం చూసి గర్వపడాలన్నారు. అన్ని గురుకులాలను అధిగమించి 261 కాలేజీలు రికార్డు సృష్టించాయని అన్నారు. ఈ ఫలితాలు చూసి బీసీ ప్రజల తమ పిల్లలను ఉచితంగా చదివించే బీసీ గురుకులాలలో చేర్పించాలని కోరారు. ప్రైవేట్, కార్పోరేట్ విద్యా సంస్థలలో చేరి అప్పుల పాలు కావద్దని పిలుపునిచ్చారు.
టీచర్ పోస్టులు భర్తీ చేయాలి
బీసీ గురుకులాలు సాధించిన రికార్డు మెరిట్ ఫలితాలు చూసైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటికి స్వంత భవనాలు నిర్మించాలని కోరారు. 331 బీసీ గురుకులాలకు 320 గురుకులాలకు స్వంత భవనాలు లేవు. చాలీ చాలని వసతులు ఇతర ఇబ్బందులు ఉన్నా మెరిట్ పలితాలలో రికార్డ్ సృష్టించారు. అలాగే ఇంకా మెరుగైన ఫలితాలు కోసం ఖాళీగా ఉన్న 4 వేల టీచర్ పోస్టుల కోసం వెంటనే డిఎస్సీ ప్రకటించాలి.
అలాగే ప్రతి పాఠశాలకు ఒక యోగా టీచర్ను నియమించాలని కోరారు. ఈ సమావేశంలో బీసీ ఫ్రంట్ చైర్మన్ గొరిగె మల్లేష్, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేష్, రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యకులు జి. అంజి, రాష్ట్ర కులాల ఐఖ్య వేదిక అధ్యక్షులు జి. అనంతయ్య, రాష్ట్ర బీసీ విద్యార్ధి సంఘం పగిళ్ల సతీష్, కన్వీనర్ మోడీ రాందేవ్, రాష్ట్ర బీసీ సంఘం రాజేందర్ పాల్గొన్నారు.






