13-11-2025 06:40:32 PM
బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ పైడిపల్లి రమేష్..
రేగొండ/భూపాలపల్లి (విజయక్రాంతి): రిజర్వేషన్లు ఎవరిచ్చే బిక్ష కాదు ఇది మా హక్కు అనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బీసీల ధర్మ పోరాట దీక్ష నిర్వహించారు. ఈ క్రమంలోనే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో కల్పించాలని ఒకరోజు దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ చైర్మన్ పైడిపల్లి రమేష్ మాట్లాడుతూ దేశ జనాభాలో మెజారిటీ అయిన బీసీలు ప్రతి రంగంలోనూ వెనకబడ్డారు. రాజకీయ, ఆర్థిక, విద్యా ,ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఎక్కడ కూడా వారికి జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం లేదు. రాజకీయంగా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు లేవు, అందువల్ల చట్టసభలలో వారి ఉనికి నామ మాత్రమే.
ఉద్యోగాలు విద్యా రంగాల్లో కూడా రిజర్వేషన్లు పూర్తిగా అమలు కావడం లేదు. బీసీలకు రిజర్వేషన్ సాధించాలంటే అన్ని రాజకీయ పార్టీలు, బీసీ ఎస్సీ ఎస్టీలు ఐక్యంగా పోరాడవలసిన ఆవశ్యకత ఏర్పడిందని,రిజర్వేషన్లు సాధించేంతవరకు ముక్క వోని దీక్షతో అందరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. 42 శాతం రిజర్వేషన్ ను భారత రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలననీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుతానికి డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ తో పాటు బీసీ జేఏసీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటి కో కన్వీనర్లు బర్ల గట్టయ్య పటేల్,గుమ్మడి ప్రదీప్ పటేల్, అమృత అశోక్ కురుమ, ఆర్డినేటర్ శేఖర్ నాని, బీసీ జేఏసీ మహిళా చైర్మెన్ మేకల రజిత, జాతీయ బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు తాటికంటి రవి కుమార్, బీసీ అజాది ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు క్యాతం మహేందర్, జేఏసీ మహిళ నాయకులు పుట్టపాక పుష్ప, ఓరుగంటి లక్ష్మి, చింతల లత, పలు సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.