calender_icon.png 13 November, 2025 | 8:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ సంపదలో సమాన వాటా దక్కాలంటే బీసీలకు రిజర్వేషన్లు తప్పనిసరి

13-11-2025 06:47:23 PM

మాజీ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదన చారి

హన్మకొండ (విజయక్రాంతి): రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు అష్టాంగ కార్యక్రమాలలో భాగంగా విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ సాధన కోసం హన్మకొండలోని ఏకశిలా పార్క్ వద్ద బీసీ జేఏసీ వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ అధ్యక్షతన బీసీల ధర్మ పోరాట దీక్ష కార్యక్రమాన్ని జరిగింది. ఈ దీక్షను సామాజిక ఉద్యమ నాయకులు కూరపాటి వెంకటనారాయణ మహాత్మా జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే దంపతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో అగ్రవర్ణాలు కూడా వారి జనాభా ప్రకారం వారికి రిజర్వేషన్లు అనుభవిస్తుంటే, జనాభాలో సగభాగానికి పైగా ఉన్న బీసీలకు మాత్రం బీసీల జనాభా ప్రకారం రిజర్వేషన్లను కల్పించడంలో అగ్రవర్ణాల పార్టీలు కుట్రలు చేస్తున్నాయని, బీసీలకు రిజర్వేషన్లను కల్పిస్తే, ఆధిపత్య కులాల పెత్తనం నడవదని భావించి బీసీల రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

ఇక నుండి బీసీలు చేసే ఉద్యమాలతో ఢిల్లీ పెద్దల దిమ్మ తిరగాలేనని ఆయన బీసీలకు పిలుపునిచ్చారు. ఈ దీక్ష కార్యక్రమానికి మద్దతు తెలపడానికి వచ్చిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను తగ్గించి, బీసీలకు తీవ్రమైన అన్యాయం చేసి, భూగర్భంలో  కలిసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదింపజేసిన బీసీ బిల్లును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని, ఆలా అయితే బీజేపీ కాలగర్భంలో కలవడం ఖాయమన్నారు. బీసీలకు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల కోటాతో పాటు చట్టసభలలో రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ అనుకూలమన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లను కల్పించేందుకు సిద్ధంగా ఉందని, కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.

మాజీ స్పీకర్ శాసనమండలి  ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూనాచారి, మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ అంటూ, బీసీలకు రిజర్వేషన్లను కల్పిస్తామంటూ, ఎన్నికల ముందు వాగ్దానాలను ఇచ్చి బీసీల ఓట్లను దండుకొని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తూతూ మంత్రంగా కులగణన చేసి, బీసీలను మభ్య పెట్టేందుకు అసెంబ్లీలో బీసీ బిల్లును ప్రవేశపెడితే తాము మద్దతు ఇచ్చామని, అయినప్పటికీ రాజ్యాంగ సవరణ ద్వారా బీసీ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్పించి, బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటుందని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు రిజర్వేషన్లను కల్పించాలంటే, అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఏకగ్రీవ తీర్మానం చేయడం ద్వారా చట్టబద్ధత కలుగదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఖిలపక్ష నేతలతో ఢిల్లీకి వెళ్లి ప్రధానిని ఒప్పించాలని, లేకుంటే ఇండియా కూటమి పార్లమెంట్ సభ్యులతో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పార్లమెంట్ ను స్తంభింపజేయాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లను కల్పించాల్సిన కేంద్రం అడ్డుకుంటుందని, రిజర్వేషన్లను కల్పిస్తామని చెప్పి ఏ పోరాటం చేయకుండా కాంగ్రెస్ పార్టీ బీసీలను మభ్యపెడుతుందని వారు ధ్వజమెత్తారు.

బీసీలంతా ఏకమై ప్రత్యేక తెలంగాణ ఉద్యమ తరహాలో ఏర్పడ్డ జేఏసీ మాదిరిగానే ప్రస్తుతం బీసీ జేఏసీ ఏర్పడిందని, అదే తెలంగాణ ఉద్యమ తరహాలో బీసీ జేఏసీని ముందుకు తీసుకెళుతున్న నాయకులకు తమవంతు పూర్తి సహకారం ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, మాజీ జడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు, బీసీ జేఏసీ నాయకులు కూరపాటి వెంకట్ నారాయణ, డా. కూరపాటి రమేష్, వీరస్వామి, గడ్డం భాస్కర్, దాడి మల్లయ్య యాదవ్, బోనగాని యాదగిరి గౌడ్, దొడ్డేపల్లి రఘుపతి, ఎల్లయ్య, సాయిని నరేందర్, తాడిశెట్టి క్రాంతి కుమార్, వల్లాల జగన్, చాపార్తి కుమార్ గాడ్గే,  జాగృతి శ్రీశైలం, డాక్టర్ జగదీష్ ప్రసాద్, ఎర్రజు బిక్షపతి, చోళ్ళోటి కృష్ణమాచారి,  గిరిబోయిన రాజయ్య యాదవ్, చంద మల్లయ్య, అరె కటిక సురేష్, వేముల మహేందర్ గౌడ్, కాసగాని అశోక్ గౌడ్, భీమగాని యాదగిరి గౌడ్, గొట్టే మహేందర్, తేల్లా సుగుణ, కిషోర్, చాగంటి రమేష్, మౌనిక తదితరులు పాల్గొన్నారు.