తిరుమలలో హుస్నాబాద్ వాసుల భజనలు
హుస్నాబాద్, జులై 2 : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఇచ్చిన పిలుపు మేరకు, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు చెందిన పద్మావతి భజన మండలి సభ్యులు తిరుమలలో భక్తిశ్రద్ధలతో భజనలు, కీర్తనలు నిర్వహించారు. బుధవారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, అలాగే రాత్రి 8 నుంచి 10 గంటల వరకు తిరుమలలోని అఖండ హరినామ స్మరణ మందిరంలో పద్మావతి భజన మండలి సభ్యులు స్వామివారి నామస్మరణతో మార్మోగిం చారు.
ఈ భజన కార్యక్రమం స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులను అలరించింది. పద్మావతి భజన మండలి సభ్యులైన కాపర్తి జయ, వెల్ది శ్యామల, కొత్తపల్లి చంద్రకళ, మాశెట్టి రాణి, గడ్డం లక్ష్మి, పూదరి లక్ష్మి, వల్లబోజు పద్మ, రోడ్డ విజయ, చిదురాల నాగరాణి, తాడ మాధవి, సావుల శోభ భజనలు, కీర్తనలు ఆలపించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచింది.




