03-07-2025 01:31:26 AM
- అనర్హులను ఎంపిక చేస్తే పథకాలకు విలువ ఉండదు
-అధికారుల పనితీరుతోనే ప్రతిబింబం
- ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
నల్లగొండ టౌన్, జూలై 2: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో భాగంగా లబ్ధిదారుల ఎంపికలో అవినీతి ఉండకూడదని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, సంక్షేమ శాఖల మంత్రి, ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఆదిత్య భవనములో నల్లగొండ సూర్యపేట యాదాద్రి భువనగిరి జిల్లాలో అమలవుతున్న పథకాలపై అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో అనర్హులని ఎంపిక చేస్తే ఆ పథకాలకు విలువ ఉండదన్నారు.
అధికారుల పనితీరుతోనే ప్రతిబింబం ఏర్పడుతుందని పనితీరులో నిజాయితీ పాదరక్షత ఉండాలని పేర్కొన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే అది అధికారుల చేతుల్లోనే ఉంటుందని తెలిపారు. గత ప్రభుత్వంలో రైతులు పడ్డారని ఈ ప్రభుత్వం రైతుల పట్ల పోరాడుతుందని అన్నారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి నల్లమాద ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కొనసాగుతుందని నల్లగొండ ఉమ్మడి జిల్లాలో కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారి అప్లికేషన్లు పరిశీలించి ఈనెల 13న ఎంపిక చేస్తే 14న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తుంగతుర్తి నియోజకవర్గంలో కొత్త రేషన్ కార్డులు అందజేయడం జరుగుతుందన్నారు.
అనంతరం బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డులు అందజేస్తామని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు త్వరలో పూర్తి చేస్తామని అన్నారు.ఎస్ఎల్బీసీ పనుల పునః ప్రారంభానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నామని, భారత సైన్యం లో పనిచేసిన అధికారులను డిప్యూటేషన్ పై తీసుకొని ఎలక్ట్రో మాగ్నెటిక్ లీడర్ సర్వే నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డిండి, హెచ్ ఎల్ సి లైనింగ్ , నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ బునియాధిగాని కాలువ, పిల్లాయిపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువలను పూర్తి చేస్తామని అయితే వీటి భూసేకరణను పూర్తి చేసే విషయంపై శాసనసభ్యులు దృష్టి నిలపాలని కోరారు.
రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఆర్ అండ్ బి ద్వారా నల్గొండ జిల్లాకు ఎక్కువ నిధులు తేవడం జరిగిందని, భవిష్యత్తులో మరిన్ని నిధులు ఇచ్చేందుకు కృషి చేస్తానని 45 కోట్లతో సంగెం బ్రిడ్జికి మంజూరు ఇవ్వడం జరిగిందని, నల్గొండ -మల్లేపల్లి -దేవరకొండ రహదారులను హామ్ రోడ్ కింద మంజూరు చేశామని, రాష్ట్రవ్యాప్తంగా 1200 కోట్ల రూపాయలతో అన్ని మండల కేంద్రాల నుండి జిల్లా కేంద్రాలకు హాం పథకం కింద డబుల్ రోడ్ల నిర్మాణానికి మంజూరు చేయడం జరిగిందని, పంచాయతీరాజ్ రోడ్లను సైతం హామ్ కింద కు తీసుకొస్తున్నట్లు తెలిపారు.
ఎస్ ఎల్ బి సి, టన్నెల్ పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని ,ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణ పై ప్రత్యేకంగా రివ్యూ చేస్తామని ,ఇన్చార్జి మినిస్టర్ జిల్లాకు ఎక్కువ సమయం కేటాయించాలని, ప్రాథమిక వైద్యం, విద్య ప్రభుత్వానికి అతి ముఖ్యమైనవని, వీటిపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని , విద్యలో భాగంగా ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ పనులను త్వరలోనే ప్రారంభం చేయనున్నామని తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో బాగా పనిచేయాలని, ఎస్డిఎఫ్ కింద ప్రతి ఎమ్మెల్యేలకు తక్షణమే ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని , ఇందుకు సంబంధించి టోకెన్లు రైజ్ చేయాలని ఎమ్మెల్యేలతో కోరారు.
ఎనిమిది నెలల్లో నల్గొండ కలెక్టరేట్లో చేపట్టిన అదనపు బ్లాకు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. సమావేశం ప్రారంభమైన వెంటనే నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, నీటిపారుదల ,విద్య, వ్యవసాయం, వైద్యం ,ఆరోగ్యం, భూభారతి, మహిళా శక్తి, సంక్షేమం తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమావేశానికి వివరించారు .
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, బీర్ల ఐలయ్య, నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ సభ్యులు కుందూర్ రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, దేవరకొండ, తుంగతుర్తి, నకిరేకల్, భువనగిరి, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, శాసనసభ్యులు, బాలు నాయక్, మందుల సామెల్, వేముల వీరేశం, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కుందూరు జైవీర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఉమ్మడి జిల్లాల అదనపు కలెక్టర్లు అధికారులు పాల్గొన్నారు.
పదేళ్లు పేదోళ్ళను మోసం చేసిన కేసీఆర్
యాదాద్రి భువనగిరి (విజయ క్రాంతి ): పదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన టిఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో పేదోళ్లను మోసం చేసిందని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు. 18 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తూ పేదోళ్ల కలలను నిజం చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతున్నదని మంత్రి అన్నారు. బుధవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామినీ ప్రభుత్వ విప్పు స్థానిక ఎమ్మెల్యే బీర్లు ఐలయ్యతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆశీర్వదించి స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేశారు.
అనంతరం యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు లు స్వప్న బాల మల్లేష్ దంపతుల ఇందిరమ్మ ఇంటిని మంత్రి ప్రారంభించారు. గ్రామంలో ప్రజలు డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు.అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ నిధులు నీళ్లు నియామకాల పేరుతో తెచ్చుకున్న తెలంగాణను టిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు. పేద వర్గాలకు న్యాయం చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్నదని అన్నారు. ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ఇచ్చిన హామీలలో ప్రతి ఒక్కటి అమలు చేసుకుంటూ మడమతిప్పకుండా మాట నిలబెట్టుకుంటున్న ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు.
సొంతింటి కలలు కన్నా పేదవాళ్లకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి వారి కళ్ళను నిజం చేస్తున్నా ప్రభుత్వం తమ ప్రభుత్వం అని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్లు మం జూరైన లబ్ధిదారులు ముందుగా ఎవరు నిర్మా ణం చేసుకుంటే వారికి పట్టు వస్త్రాలతో పాటు దావత్ కు గొర్రె పొడేలును ఇస్తానని గతంలో హామీ ఇచ్చారు.అన్న మాట ప్రకారం ఇందిరమ్మ ఇంటి లబి దారు లు స్వప్న బాల మల్లేష్ దంపతులకు పట్టు వస్త్రాలు అందజేసి గొఱ్ఱెపుడేలును మంత్రి చేతుల మీదుగా ఎమ్మెల్యే ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు, అదనపు కలెక్టర్ భాస్కరరావు ఇతర అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.