29-05-2025 02:33:28 PM
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల అమలు తీరుపై(Government Schemes) సమీక్షా సమావేశం జరిగింది. ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన జిల్లా ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో డిప్యూటీ భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క( Deputy Chief Minister Mallu Bhatti Vikramarka ) మాట్లాడుతూ... అన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. ఈ సారి ధాన్యం దిగుబడి రికార్డు స్థాయిలో వచ్చిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా రానంత ధాన్యం దిగుబడి వచ్చిందని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు.
రికార్డు స్థాయిలో ధాన్యం వస్తే.. అంతే స్థాయిలో ధాన్యం సేకరిస్తున్నామని పేర్కొన్నారు. సన్నవడ్లకు బోనస్ ఇవ్వడంలో ఎలాంటి లోపాలు జరగవద్దని అధికారులను ఆదేశించారు. పేదల ఇంటికి రూ. 5 లక్షలు ఇస్తున్న రాష్ట్రం మరొకటి లేదని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. పేదల ఇంటి నిర్మాణానికి గత బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) ప్రభుత్వం కూడా రూ. 5 లక్షలు ప్రకటించిందని చెప్పిన భట్టి విక్రమార్క పదేళ్లలో ఒక్కరికి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలన్నారు. పూర్తిస్థాయిలో భూభారతి అమలుకు సిద్ధం అవుతున్నామని ఆయన పేర్కొన్నారు. ధరణిని రద్దు చేస్తామని ఎన్నికల అజెండాలోనే పెట్టామని చెప్పారు.
జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా నిర్వహించాలని భట్టి విక్రమార్క సూచించారు. ప్రజా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలు ధాన్యం కొనుగోలు విషయంలో ముందుండడం అభినందనీయమన్నారు. 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేసి వారం లోపే నగదు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. సొంతిటి కలలు నిజం చేయడానికి ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకుంటూ రైతులకు న్యాయం చేస్తున్నామని వెల్లడించారు. ధరణి తప్పుడు చట్టం రద్దు చేసి భూ భారతి ద్వారా సులభతరం చేశామన్నారు. ఎర్రుపాలెం మండలంలో భూ భారతి పైలట్ కార్యక్రమం జూన్ 3న ప్రారంభిస్తామని చెప్పారు. అన్ని శాఖల పునరుద్ధరణకు అధికార యంత్రాంగం చురుకుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యశ్రీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల లభ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను భట్టి విక్రమార్క ఆదేశించారు.