29-05-2025 01:50:57 PM
బీజేపీ సీనియర్ నాయకులు కాశెట్టి కుమార్.
హుజూరాబాద్,మే29: (విజయ క్రాంతి): సామాజిక ఉద్యమాలతో ప్రజల్లో చైతన్యం కలిగించిన ప్రజా ఉద్యమకారుడు మందకృష్ణ మాదిగకు(Manda Krishna Madiga) పద్మశ్రీ అవార్డు దక్కడం గర్వకారణమని బీజేపీ సీనియర్ నాయకులు, కౌ ఫౌండేషన్ చైర్మన్ కాశెట్టి కుమార్ అన్నారు. గురువారం ఢిల్లీలో ని తెలంగాణ భవన్ లో పలువురు న్యాయవాదులతో కలిసి కాశెట్టి కుమార్ మందకృష్ణమాదిగను మర్యాదపూర్వకంగా కలిసి పద్మశ్రీ అవార్డు అందుకున్న సందర్భంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కాశెట్టి కుమార్ మాట్లాడుతూ...హన్మకొండ జిల్లా శాయంపేటకు చెందిన మందకృష్ణ మాదిగ అనేక సామాజిక ఉద్యమాలు నడిపి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని, ఎమ్మార్పీఎసన్ను స్థాపించి ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమం ప్రారంభించారన్నారు.
రాజకీయ జీవితంలో ఎన్నడూ పదవులు ఆశింకుండా ప్రజల వైపే నిలిచిన గొప్ప నాయకుడు మందకృష్ణమాదిగ అన్నారు. ఆయన చేసిన ప్రజా ఉద్యమాల ఫలితంగా పద్మశ్రీ పురస్కారం దక్కడం అభినందనీయమన్నారు. మందకృష్ణతో తనకు ఎన్నో ఏళ్లుగా ఆత్మీయ అనుబంధం ఉందని, మందకృష్ణ అంటే తనకు ఎంతో అభిమానమని కాశెట్టి కుమార్ అన్నారు. మందకృష్ణకు పద్మశ్రీ అవార్డు అందించిన ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపతి ముర్ములకు కృతజ్ఞతలు తెలిపారు.