తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి వేడుకలు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు(Bhogi celebrations) ఘనంగా జరుగుతున్నాయి. మూడు రోజుల పంటల పండుగ సంక్రాంతి, తెలంగాణలో బుధవారం 'భోగి'తో ప్రారంభమైంది. పండుగలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా తెల్లవారుజామున భోగి మంటలు వెలిగించారు. కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి చిన్నారులు భోగిమంటలు వేశారు. ఈ మూడు రోజుల పండుగను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో భోగి, మకర సంక్రాంతి, కనుమ పేర్లతో జరుపుకుంటారు.
తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ(Telangana Governor Jishnu Dev Varma), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఇతర నాయకులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి ముగ్గులతో అలరారుతున్న తెలుగు లోగిళ్లలో భోగి పండుగ జరుపుకుంటున్న తెలుగు ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేదీప్యమానంగా వెలిగే భోగి మంటలు మీకు, మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని మనసారా ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. ఆశావహ దృక్పథంతో సాగే మీ ఆలోచనలు సాకారం కావాలని... అందుకు మీకు అండగా ఉంటానని ఈ సందర్భంగా చంద్రబాబు తెలియజేశారు.






