12-06-2025 12:08:34 AM
కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్ జూన్ 11 (విజయక్రాంతి): భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుధవారం దిలావర్పూర్ మండలంలోని సాంగ్వి గ్రామంలో నిర్వహించిన భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి భూ సమస్యలు తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. అవసరమైతే అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.పునరావాస గ్రామమైన సాంగ్వికి రెవెన్యూ మ్యాప్ అందుబాటులో లేకపోవడంతో గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, త్వరితగతిన మ్యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
భూభారతి సదస్సులను పూర్తిస్థాయిలో వినియోగించుకొని తమ భూ సమస్యలపై దరఖాస్తులు సమర్పించుకోవాలని ప్రజలకు కలెక్టర్ సూచించారు. అనంతరం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. విద్యార్థుల సంఖ్య, తరగతి గదులు, యూనిఫామ్, పాఠ్యపుస్తకాల పంపిణీ తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఆ తరువాత అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శిం చారు. కలెక్టర్ స్వయంగా చిన్నారులకు ఎగ్ బిర్యానీ వడ్డించారు.అనంతరం బడిబాట కార్యక్రమంలో కలెక్టర్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో కలిసి ర్యాలీని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్నకళ్యాణి, డీఈఓ పి. రామారావు, తహసిల్దార్ ఎజాజ్, ఎంపీడీఓ అరుణ, రెవెన్యూ, విద్యాశాఖల అధికారులు పాల్గొన్నారు.
విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలి
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీ లలో విద్యార్థులకు మెరుగైన విద్యా బోధనతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశిం చారు. బుధవారం దిలావర్పూర్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయా న్ని (కేజీబీవీ) కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల మైదానం, తరగతి గదులు, వంటగది, స్టోర్రూమ్, కుళాయిలు తదితర సదుపాయాలను పరిశీలించారు.