28-09-2025 10:59:00 PM
హనుమకొండ (విజయక్రాంతి): వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం, మల్లంపల్లి గ్రామానికి చెందిన యువ ప్రతిభ భూమా నందినిని ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. ఇటీవల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫైన్ ఆర్ట్స్ అండ్ అవార్డ్స్ నుండి ఆమె యంగ్ ఛాంపియన్ అవార్డు, వరల్డ్ రికార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ సర్టిఫికెట్ ను అందుకున్నారు. సెప్టెంబర్ 22న న్యూ ఢిల్లీలోని భారత మండపం వేదికగా జరిగిన కార్యక్రమంలో ప్రముఖుల చేతుల మీదుగా నందిని ఈ అవార్డులు స్వీకరించారు. చిన్న వయసులోనే ఆమె సాధించిన ఈ విజయాలు పట్టుదల, కృషి, అసాధారణ ప్రతిభకు నిదర్శనం అని సహచరులు కొనియాడారు. దేశస్థాయిలో ఇంతటి మహోన్నతమైన అవార్డు అందుకున్న నందినిని ఆదివారం రోజు బీజేపీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ శాలువాతో సన్మానించి అభినందించారు. రానున్న రోజుల్లో ఆమె మరింత ఉన్నత శిఖరాలకు చేరుకునేలా తన సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు. అనంతరం నందిని మాట్లాడుతూ తన విజయానికి సహకరించిన తల్లిదండ్రులకు మరి కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చేశారు.