calender_icon.png 15 June, 2025 | 1:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైకుల చోరీ ముఠా అరెస్ట్

15-06-2025 12:27:54 AM

12 బైకులు, రూ. 8 వేలు స్వాధీనం..

వివరాలు వెల్లడించిన నార్సింగి ఏసీపీ రమణ గౌడ్..

చేవెళ్ల(శంకర్‌పల్లి): ద్విచక్ర వాహనాలు దొంగిలించి.. నకిలీ ఆర్ సీలు తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను శంకర్‌పల్లి పోలీసులు(Shankarpally Police) పట్టుకున్నారు. శనివారం నార్సింగి ఏసీపీ రమణ గౌడ్ శంకర్ పల్లి పీఎస్ లో ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించారు. మెహిదిపట్నానికి చెందిన బొగ్గుల శ్రీనివాస్(42) వృత్తి రీత్యా డ్రైవర్. కొన్నాళ్ల కింద  శంకర్ పల్లిలోని డబుల్ బెడ్ రూం బ్లాక్ లోకి షిఫ్ట్ అయ్యాడు. ఇతను నాలుగు నెలలుగా శంకర్‌పల్లి, నార్సింగి, మెహిందీపట్నం, అత్తాపూర్, గుడిమల్కాపూర్, కోటి ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్నాడు. ముందుగా తన బైక్ పై షాపింగ్ మాల్స్, మార్కెట్ పార్కింగ్‌ లు, పబ్లిక్ ప్లేసుల్లో పగలు, రాత్రి రెక్కీ చేసి ద్విచక్ర వాహనాలను గుర్తించేవాడు.

బైక్ ను చోరీ చేసి.. సేమ్ కలర్, సేమ్ కంపెనీకి సంబంధించి మరో వాహనం నంబర్ ప్లేట్, ఛాసిస్ నంబర్ ఫోటోలు తీసేవాడు. తర్వాత ఆర్ టీఐ కి సంబంధించిన ఎం వ్యాలెట్ యాప్ ద్వారా ఛాసిస్ నెంబర్ ఎంటర్ చేసి ఆర్ సీని డౌన్ లోడ్ చేసేవాడు. వీటి అధారంగా ఆర్ సీ కార్డు తయారు చేసి.. ఆ నెంబర్ ప్లేట్ ను దొంగిలించిన వాహనానికి బిగించేవాడు.  ఆ తర్వాత ఈ ఫొటోలను  కొండాపూర్కు చెందిన బొల్లు నాగరాజు అలియాస్ రాజు (38)కు పంపేవాడు.

నాగరాజు ఆ ఫొటోలను తన స్నేహితులు, బంధువులకు పంపించి.. ఆ వాహనాలు బ్యాంక్ సీజ్ చేసినవి , మార్టిగేజ్ లో ఉన్నవని చెప్పి తన కమీషన్ కలుపుకొని ఎక్కువ ధరకు అమ్మేవాడు.   ఈ వాహన చోరీలకు సంబంధించి శంకర్ పల్లి పీఎస్లో 4, నార్సింగి పీఎస్ లో 2, కల్సుంపుర పీఎస్ లో 2, గుడిమల్కాపూర్ పీఎస్ 1, అత్తాపూర్ పీఎస్ లో 2 కేసులు నమోదయ్యాయి. ఈ కేసును చాలెంజింగ్ గా తీసుకున్న శంకర్ పల్లి పోలీసులు శుక్రవారం రాత్రి నిందితులను అరెస్ట్ చేసి... వారి నుంచి  12 మోటార్‌సైకిల్స్, రూ. 8,000ను స్వాధీనం చేసుకున్నారు.  నిందితులను రిమాండ్‌కు తరలించామని,   మరింత లోతుగా  విచారణ చేస్తున్నట్లు ఏసీపీ వెల్లడించారు.